8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. ఆ తేదీ నుంచే భారీగా పెరగనున్న జీతాలు !
8th Pay Commission: 8వ వేతన సంఘం పై ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. 8వ వేతన సంఘం రిపోర్టు సమర్పణ గడువు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, బకాయిల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

8వ వేతన సంఘం పై పార్లమెంట్లో మోదీ ప్రభుత్వం బిగ్ అప్డేట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు, రిపోర్టు సమర్పణ, ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పలు విషయాలను స్పష్టం చేశారు.
8వ వేతన సంఘం తన తుది రిపోర్టు 3 మే 2027 నాటికి సమర్పించనుందని ఆయన తెలిపారు. 3 నవంబర్ 2025న ఏర్పాటు చేసిన ఈ కమిషన్కు తమ సిఫార్సులను అందించడానికి మొత్తం 18 నెలల సమయం ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది.
రిపోర్టు ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపు ఎప్పటి నుంచి అమలు?
8వ వేతన సంఘం తన తుది రిపోర్టు ను మే 2027లో సమర్పించినప్పటికీ, నూతన వేతన సిఫార్సులు మాత్రం 1 జనవరి 2026 నుంచే అమలులోకి వస్తాయి. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. 7వ వేతన సంఘం 1 జనవరి 2016 నుండి అమలులోకి వచ్చినందున, నియమాల ప్రకారం 8వ వేతన సంఘం కూడా 1 జనవరి 2026 నుంచే వర్తిస్తుంది.
రిపోర్ట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానిని పరిశీలించి, ఆమోదం తెలిపేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుంది. అందువల్ల, జనవరి 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే వరకు మధ్యలో ఉన్న కాలానికి సంబంధించిన పెంచిన జీతభత్యాల మొత్తాన్ని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకేసారి ఏరియర్స్ రూపంలో చెల్లిస్తారు. అంటే ఉద్యోగులకు దాదాపు 16 నుండి 18 నెలల భారీ ఏరియర్స్ లభించే అవకాశం ఉంది.
7వ వేతన సంఘంలో ఏం జరిగింది?
గతంలో 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటై, నవంబర్ 2015లో తన రిపోర్టును సమర్పించింది. ప్రభుత్వం దీనికి జూన్ 2016లో ఆమోదం తెలిపినప్పటికీ, ఉద్యోగులకు 1 జనవరి 2016 పూర్వ తేదీ నుంచే లబ్ధి చేకూర్చారు. అంటే అప్పట్లో కేంద్ర ఉద్యోగులకు మొత్తం ఏడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ప్రభుత్వం స్పష్టత
కొత్త వేతన సంఘంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. కొత్త వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేటప్పుడు కేంద్ర ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని సవరించడానికి ఉపయోగించే గుణకాన్నే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ఇది జీతం, పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
ఉద్యోగ సంఘాలు ఈసారి 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని సంఘాలు 3.0 నుండి 3.5 మధ్య ఉండాలని సూచించాయి. అంతేకాకుండా, కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నిర్ణయించేటప్పుడు కుటుంబ యూనిట్ల సంఖ్యను మూడు నుండి ఐదుకు పెంచాలని అంటే తల్లిదండ్రులను కూడా చేర్చాలని కోరుతున్నాయి.
ఈ డిమాండ్లపై రాజ్యసభ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, 8వ వేతన సంఘం ఒక స్వతంత్ర సంస్థ అని, అది తన సొంత పని విధానాన్ని తాను నిర్ణయించుకుంటుందని చెప్పారు. తమ అంతర్గత చర్చలు లేదా సంప్రదింపుల పురోగతి గురించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం కమిషన్ నిబంధనలలో లేదని, అందుకే ఈ డిమాండ్లపై కమిషన్ ఏ నిర్ణయం తీసుకుందో తమ వద్ద ప్రస్తుతానికి వివరాలు లేవని తెలిపారు.
డిమాండ్ల స్వీకరణ, డేటా సేకరణ వేగవంతం
ప్రస్తుతం 8వ వేతన సంఘం సమాచార సేకరణ, చర్చల దశలో ఉంది. ఉద్యోగ సంఘాలు, విభాగాలు, వాటాదారుల నుండి అభిప్రాయాలను సేకరిస్తోంది.
• ఢిల్లీలో ఆగస్టు 7, 8 తేదీల్లో రిపోర్టులు ఇవ్వని సంఘాలతో సమావేశాలు జరగనున్నాయి. దీని కోసం అపాయింట్మెంట్ గడువును 31 జూలై 2026 వరకు నిర్ణయించారు.
• చెన్నైలో సెప్టెంబర్ 7, 8, పుదుచ్చేరిలో సెప్టెంబర్ 9 తేదీల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అర్హత కలిగిన యూనియన్లు 18 ఆగస్టు 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు తమ డేటాను కమిషన్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి చివరి తేదీని 31 జూలై 2026 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

