- Home
- Telangana
- Rain Alert: వచ్చే 3 రోజులు దబిడి దిబిడే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert: వచ్చే 3 రోజులు దబిడి దిబిడే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వర్షం కురుస్తోంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతోంది.

బంగాళాఖాత ద్రోణి ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. దీని కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన సమాచారం ప్రకారం వచ్చే మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే పరిస్థితి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
గురువారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
ఇటీవలి వర్షాల కారణంగా పలు జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ప్రాంతంలో అత్యధికంగా 3.49 సెం.మీ వర్షం కురిసింది. హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలో 2.82 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2.22 సెం.మీ, రంగారెడ్డి జిల్లా గండిపేట ప్రాంతంలో 1.88 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
మరోవైపు ఎండల ప్రభావం
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్కు చేరింది. మహబూబ్నగర్లో 37.6 డిగ్రీలు, ఖమ్మంలో 36.2 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 36.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఒకే సమయంలో రాష్ట్రంలో ఎండలూ, వర్షాలూ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్లో వడగళ్ల వాన భయాందోళన
భాగ్యనగరంలో వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మంగళవారం సాయంత్రం పడిన భారీ వర్షం నుంచి నగరం పూర్తిగా కోలుకోకముందే బుధవారం మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్ముకొని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగగా, పలుచోట్ల వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

