Kavitha: ఆ రూ. 1400 కోట్లు అమరవీరుల కుటుంబాలకు పంచండి.. కవిత కీలక వ్యాఖ్యలు
Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత కొత్తగూడెం పర్యటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణి "బాయి బాట" కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదన్న కవిత
తాను మళ్లీ బీఆర్ఎస్లో చేరబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత ఖండించారు. తన జీవితంలో ఎప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఉద్యమకారులు, కార్మికులు, చిన్న కాంట్రాక్టర్ల కోసం పోరాడానని గుర్తుచేశారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన వారికి సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత స్థాయిలో దూషణలు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల పట్ల గౌరవం పాటించాలని సూచిస్తూ, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తలు మాత్రం అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ నిధులు, క్విడ్ ప్రోకో ఆరోపణలు
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల మూలాలపై కవిత ప్రశ్నలు లేవనెత్తారు. ఆ నిధులు ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంట్రాక్టర్ల నుంచి క్విడ్ ప్రోకో రూపంలో వచ్చాయా అని ప్రశ్నించారు. ఆ డబ్బును రాజకీయ అవసరాలకు కాకుండా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. ఇక కేటీఆర్పై కూడా ఆమె పలు ఆరోపణలు చేశారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు అక్రమ అనుమతులు ఇచ్చారని, ఫీనిక్స్ సంస్థకు భారీ విలువైన భూములు కేటాయించారని ఆరోపించారు. ఆ సంస్థ అటవీ ప్రాంతాల్లో భారీ స్థాయిలో కలప నరికేస్తోందని, దీనిపై నమోదైన కేసులను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఇటీవల రూ.188 కోట్లతో ఒక ఆంగ్ల పత్రికను కొనుగోలు చేశారంటూ ఆరోపణలు చేశారు.
కాళేశ్వరం, భూ కేటాయింపులపై కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్రావుపై ఆరోపణలు చేస్తూ, ఆయనను ముందుంచుకుని బీఆర్ఎస్ ముందుకు సాగుతోందని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ పనిచేయకపోయినా, ప్రత్యామ్నాయంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా కూడా ప్రాజెక్టు రిజర్వాయర్లకు నీరు అందించవచ్చని తెలిపారు. గత ప్రభుత్వంపై రాజకీయ కక్షతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. అలాగే 2014 తర్వాత కేసీఆర్, రేవంత్రెడ్డి ప్రభుత్వాలు వివిధ సంస్థలకు కేటాయించిన భూములన్నింటినీ తమ పార్టీ అధికారంలోకి వస్తే సమీక్షిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన భూ కేటాయింపులను కాంగ్రెస్ మరింత విస్తరించిందని ఆరోపించారు.
సింగరేణి పరిస్థితిపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన కవిత
సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కవిత ఆరోపించారు. సంస్థకు రావాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సింగరేణిలో ఓపెన్కాస్ట్, అండర్గ్రౌండ్ గనుల మధ్య సమతుల్యత ఉండాలని, అప్పుడే సంస్థ దీర్ఘకాలికంగా నిలదొక్కుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం అధికారులు, కార్మికులకు వేర్వేరు నిబంధనలు అమలవుతున్నాయని విమర్శించారు.
అధికారులు చెప్పిందే మాట్లాడటం తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటి మీద కనీస అవగాహన లేదు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారు. pic.twitter.com/71EY1W2uPu
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 9, 2026
టీఆర్ఎస్ పేరుపై కుట్రల ఆరోపణ
తెలంగాణ రక్షణ సేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నందుకే తమపై కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. తమ పార్టీ పేరును అధికారికంగా నమోదు కాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికల సంఘానికి వెయ్యికిపైగా ఫిర్యాదులు ఇచ్చారని చెప్పారు. సింగరేణికి నిజాం కాలంలో 17 బొగ్గు గనులు కేటాయించారని గుర్తుచేసిన ఆమె, యూపీఏ హయాంలో జరిగిన భూ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను జాతీయం చేసిందన్నారు. ప్రస్తుతం తాడిచర్ల గనిని మాత్రమే సింగరేణికి ఇచ్చారని, మిగిలిన 16 గనులను కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

