- Home
- Automobile
- Bikes
- లైసెన్స్ అవసరం లేదని.. ఏ వయసు వారైనా ఎలక్ట్రిక్ స్కూటీ నడపొచ్చా.? చట్టం ఏం చెబుతోంది.?
లైసెన్స్ అవసరం లేదని.. ఏ వయసు వారైనా ఎలక్ట్రిక్ స్కూటీ నడపొచ్చా.? చట్టం ఏం చెబుతోంది.?
Electric Vehicle: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన RTO నిబంధనలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఏ ఎలక్ట్రిక్ బైక్కు లైసెన్స్ అవసరం?
అన్ని ఎలక్ట్రిక్ బైక్లకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 250 వాట్ల వరకు మోటార్ పవర్ ఉండి, గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లలోపు ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే ఇలాంటి వాహనాలకు సాధారణంగా RTO రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు. అయితే 250 వాట్లకు పైగా మోటార్ సామర్థ్యం ఉండి, గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్ బైక్లు లేదా స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. వీటిని RTOలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేందుకు కనీస వయసు ఎంత?
భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపేందుకు కనీస వయసు 16 సంవత్సరాలు. అయితే 16 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు చట్టం ప్రకారం అవసరమైన డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులై లెర్నర్ లేదా సంబంధిత లైసెన్స్ పొందాలి. అలాగే ఈ వయస్సు వారు తక్కువ సామర్థ్యం గల వాహనాలనే నడపడానికి అర్హులు. నిబంధనలకు అనుగుణంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్లు జారీ చేస్తారు. లైసెన్స్ అవసరం లేదని చిన్న పిల్లలు ఎలక్ట్రిక్ స్కూటీ నడిపితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్పై RTO నిబంధనలు
అధిక సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే రోడ్లపై చట్టబద్ధంగా నడపవచ్చు. అలాగే మోటార్ వాహనాల చట్టం-1988 ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరమైన ప్రతి ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనానికి ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా సమగ్ర (కాంప్రిహెన్సివ్) ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం, వాహనం విలువ ఆధారంగా ప్రీమియం మారుతుంది.
రోడ్ ట్యాక్స్, ప్రభుత్వ రాయితీలు
సాధారణ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ మినహాయింపులు అమల్లో ఉన్నాయి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) పథకం ద్వారా అర్హత కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులపై కొనుగోలు భారం కొంత తగ్గుతుంది.
హెల్మెట్ ధరించడం తప్పనిసరి..
ఎలక్ట్రిక్ బైక్ అయినా, పెట్రోల్ బైక్ అయినా రోడ్లపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇది ప్రతి రైడర్ భద్రత కోసం అమల్లో ఉన్న నిబంధన. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే లైసెన్స్ అవసరమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని సరైన లైసెన్స్ లేకుండా నడపడం చట్ట విరుద్ధం. ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ముందు దానికి సంబంధించిన అన్ని RTO నిబంధనలు తెలుసుకుని, వాటిని తప్పనిసరిగా పాటించడం అత్యంత ముఖ్యం.

