హైదరాబాద్లో అద్భుతం.. 65 అంతస్తులతో సౌతిండియాలోనే అత్యంత ఎత్తైన టవర్స్ నిర్మాణం
Hyderabad: హైదరాబాద్లో మరో భారీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ రానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన ట్రంప్ బ్రాండ్ పేరుతో నగరంలో తొలి ట్రంప్ టవర్స్ హైదరాబాద్ నిర్మించనున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో నిర్మిస్తున్నారు.

హైదరాబాద్లోనే అతిపెద్ద ట్రంప్ టవర్స్
ట్రంప్ టవర్స్ హైదరాబాద్ను నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. మొత్తం 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ఉండనుంది. ఇందులో 65 అంతస్తుల రెండు భారీ టవర్లు నిర్మిస్తారు. సుమారు 242 మీటర్ల ఎత్తుతో ఇవి భారత్లోనే అత్యంత ఎత్తైన ట్రంప్ బ్రాండ్ రెసిడెన్షియల్ టవర్లుగా నిలవనున్నాయి. అలాగే సౌతిండియాలో అతిపెద్ద నిర్మాణం కానుంది. ఈ రెండు టవర్లను 28వ అంతస్తులో స్కై బ్రిడ్జ్ ద్వారా అనుసంధానిస్తారు. ఆ స్కై బ్రిడ్జ్పై ప్రత్యేకంగా ట్రంప్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
450కిపైగా లగ్జరీ ఫ్లాట్లు.. ధర రూ.5.3 కోట్ల నుంచి
ఈ ప్రాజెక్ట్లో 450కిపైగా లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించనున్నారు. 3.5 బీహెచ్కే, 4 బీహెచ్కే అపార్ట్మెంట్లతో పాటు డబుల్ హైట్ సింప్లెక్స్ రెసిడెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రైవేట్ లిఫ్ట్ లాబీ ఏర్పాటు చేస్తారు. ఫ్లాట్ల ధరలు రూ.5.3 కోట్ల నుంచి ప్రారంభమై రూ.18 కోట్ల వరకు ఉండనున్నాయి. ఇప్పటికే పెంట్హౌస్లపై భారీ డిమాండ్ కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న పెంట్హౌస్లలో చాలా వరకు ముందుగానే బుక్ అయినట్లు డెవలపర్ సంస్థ వెల్లడించింది.
రూ.1,800 కోట్ల పెట్టుబడి.. రూ.4,200 కోట్ల అమ్మకాలే లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు రూ.1,800 కోట్లు (భూమి ధర మినహాయిస్తే) ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయానికి రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు అమ్మకాలు జరిగే అవకాశం ఉందని ట్రిబెకా డెవలపర్స్ అంచనా వేస్తోంది. ట్రంప్ బ్రాండ్తో వచ్చే ప్రాజెక్టులు సాధారణంగా అదే ప్రాంతంలోని ఇతర లగ్జరీ ప్రాజెక్టుల కంటే అధిక ధరలకు విక్రయమవుతుంటాయి. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉండొచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు.
హైదరాబాద్ను ఎందుకు ఎంచుకున్నారు?
గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా కోకాపేట, నియోపోలిస్, నర్సింగి ప్రాంతాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఐటీ కంపెనీలు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (GCCలు), మెడిసిన్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతుండటంతో అధిక ఆదాయం కలిగిన ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (NRIలు) ఇక్కడ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. డెవలపర్ సంస్థ అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్లో మొత్తం అమ్మకాలలో 25 నుంచి 30 శాతం వరకు NRIల నుంచే రావచ్చు. హైదరాబాద్కు చెందిన విదేశీ భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ట్రంప్ బ్రాండ్కు భారత్లో మరో భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్ ప్రాజెక్ట్తో కలిపి ట్రంప్ బ్రాండ్కు భారత్లో మొత్తం ఏడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఇప్పటికే ముంబై, పుణే, గురుగ్రామ్, కోల్కతాలో ట్రంప్ బ్రాండ్తో లగ్జరీ నివాస ప్రాజెక్టులు ఉన్నాయి. పుణేలో వాణిజ్య ప్రాజెక్ట్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. త్వరలో నోయిడాలో మరో ట్రంప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కూడా రానుంది.
ట్రంప్ టవర్స్ హైదరాబాద్కు ఇప్పటికే రెరా అనుమతి లభించింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EOI) దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముందుగా నమోదు చేసుకున్న వారికి అధికారిక అమ్మకాలు ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యం ఇస్తామని డెవలపర్ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ను ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ట్రంప్ సంస్థ ఈ ప్రాజెక్ట్కు తన బ్రాండ్ను మాత్రమే అందిస్తోంది. నిర్మాణ పనుల్లో ట్రంప్ సంస్థ నేరుగా పాల్గొనడం లేదు. అక్టోబర్లో జరిగే అధికారిక ప్రారంభ కార్యక్రమానికి ట్రంప్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

