- Home
- Telangana
- Hyderabad: ఇది పూర్తయితే హైదరాబాద్లో దేశంలో టాప్ సిటీ కావడం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్
Hyderabad: ఇది పూర్తయితే హైదరాబాద్లో దేశంలో టాప్ సిటీ కావడం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రక్రియ వేగం అందుకుంది. జీహెచ్ఎంసీ పరిమితుల్లో మరికొన్ని పంచాయతీలు, మున్సిపాలీటను వీలినం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అంశం తెరపైకి వచ్చింది.

జీహెచ్ఎంసీ విస్తరణ
ప్రస్తుతం దాదాపు 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, విస్తరణ తర్వాత 2,000 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు, రాబోయే పట్టణాలను "టిసి.యూ.ఆర్" (Telangana Core Urban Region) గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది హైదరాబాద్ను విస్తారమైన మెగా సిటీగా మార్చే దిశలో కీలకమైన అడుగు. అయితే దేశంలోనే పెద్ద నగరంగా మారనున్న హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో పెరగనుంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణ చేపట్టాలనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
163 కిలోమీటర్ల సూపర్ ప్రణాళిక
కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను మరింత విస్తరించేందుకు పెద్దగా ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో భాగంగా మొత్తం 8 కొత్త కారిడార్లు 163 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించనున్నారు. దాదాపు రూ. 43 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం దేశంలో 5వ స్థానంలో ఉండగా, విస్తరణ పూర్తయితే మొదటి స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
మూడో దశతో ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం
ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో మెట్రో మూడో దశ గురించి కూడా చర్చ నడుస్తోంది. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా..
శంషాబాద్ – పెద్ద అంబర్పేట్: 5 స్టేషన్లు (40 కిమీ)
పెద్ద అంబర్పేట్ – మేడ్చల్: 5 స్టేషన్లు (45 కిమీ)
మేడ్చల్ – పటాన్చెరు: 3 స్టేషన్లు (29 కిమీ)
పటాన్చెరు – నార్సింగి: 3 స్టేషన్లు (22 కిమీ).
ఈ మార్గాలు కలిపితే 136 కిలోమీటర్ల మెట్రో వలయాకారం ఏర్పడుతుంది. ఇది సాకారమైతే.. జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా ముందే ఆపేందుకు, శివార్లలోనుంచే మెట్రో కనెక్టివిటీ అందించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గిస్తుందని అనుకుంటున్నారు.
శివారుల్లోని గ్రామాలకు భారీ లాభం
ఒకవేళ అవుటర్ చుట్టూ మెట్రో అందుబాటులోకి వస్తే.. శంషాబాద్, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల, శామీర్పేట, మేడ్చల్, పటాన్ చెరు, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాంతాలు భారీగా లబ్ధిపొందనున్నాయి. ఈ ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెరుగుపడటంతో ఉద్యోగాలు, వాణిజ్యం, రవాణా అవకాశాలు విస్తరిస్తాయి. కొన్ని గ్రామాలు త్వరలోనే అర్బన్ జోన్లుగా మారే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ దూకుడు ఖాయం
మెట్రో విస్తరణ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రావడం వల్ల శివార్లలో ప్లాట్లు, ఇండ్ల ధరలు 40–80% వరకు పెరిగే అవకాశం ఉంది. కారిడార్లకు సమీప ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రాజెక్టులు విస్తరణ జరుగుతుంది. ఐటీ ఉద్యోగులు, స్టార్ట్అప్స్ శివార్ల వైపు మళ్లే అవకాశం ఉంటుంది. మియాపూర్, నాగోల్, ఎల్బీ నగర్లపై మెట్రో ఎలాంటి ప్రభావం చూపిందో.. ఓఆర్ఆర్ రీజియన్లో అలాంటి ప్రభావమే కనిపించనుంది. మొత్తం మీద ఓఆర్ఆర్ మెట్రో పూర్తి అయితే హైదరాబాద్ శివార్లు కొత్త రియల్ ఎస్టేట్ హబ్గా మారతాయి.

