- Home
- Telangana
- Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వానలు.. నేడు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇక ఈ వర్షాకాలమంతా ఇలాగే వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశాలుంటే ముందుగానే హెచ్చరిస్తోంది… ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వర్ష సమయంలో బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరుతోంది వాతావరణ శాఖ.
నేడు తెలంగాణలో వర్షాలే వర్షాలు
శుక్రవారం (జులై 18) తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం సాయంత్రం నుండి మొదలైన వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయని... మరికొన్ని జిల్లాలకు ఈ వానలు విస్తరిస్తాయని వెల్లడించింది. ఇలా ఓ ఏడు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,హన్మకొండ, భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. కాబట్టి ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ప్రజలు ముందుగానే జాగ్రత్తపడాలని సూచించింది. వర్షాలు ప్రారంభమయ్యే ముందే ఏవయినా పనులుంటే పూర్తిచేసుకోవాలని… వర్ష సమయంలో బయటకు రావద్దని హెచ్చరిస్తోంది.
హైదరాబాద్ లో వర్షాలు
ఇక హైదరాబాద్ లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది... రాత్రంతా చిరుజల్లులు కొనసాగాయి. ప్రస్తుతం (శుక్రవారం ఉదయం) వర్షం లేదు.. కానీ తిరిగి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మేఘాలు కమ్ముకుని వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వర్షాలు, ఈదురుగాలులతో ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉంటుంది కాబట్టి నగరప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు
గురువారం ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి.. ఇవి ఇవాళ(శుక్రవారం) కూడా వానలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కర్నూల్, నంద్యాల, సత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. శని, ఆదివారం కూడా వర్షాలు కొనసాగుతాయని హెచ్చరించింది.