- Home
- Telangana
- Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట
Half Day Schools : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. ఫిబ్రవరి 19 నుండే ఆ స్కూళ్లకు ఒంటిపూట
Half Day Schools : తెలంగాణ విద్యాశాఖ ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు కాస్త ముందుగా, ఇతర స్కూళ్లకు తర్వాత ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

తెలుగు విద్యార్థులకు గుడ్ న్యూస్
Half Day Schools : ఇక శీతాకాలం ముగిసినట్లే... ప్రస్తుతం చలి పూర్తిగా తగ్గిపోయి ఉక్కపోత మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉందంటే మార్చిలో మరింత దారుణంగా ఉంటుంది... అందుకే విద్యార్థులకు ఈ ఎండలనుండి ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పటినుండి ఒంటిపూట బడులు నిర్వహించాలో ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్ ఎప్పట్నుంచి..?
తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మార్చి 16 నుండి కేవలం ఒకేపూట నడుస్తాయని విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం తొందరగా ప్రారంభమై మధ్యాహ్నానికి క్లాసులు పూర్తిచేయాలని.. ఇందుకు తగినట్లు టైమ్ టేబుల్ రెడీ చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని... ఆ తర్వాత విద్యార్థులు ఇంటికి వెళ్లిపోవచ్చని పేర్కొంది.
అయితే మార్చి 14 నుండి తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లకు మాత్రం టైమ్ టేబుల్ భిన్నంగా ఉంటుంది... వీరు మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యధావిధిగా కొనసాగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా స్కూల్ వదలగానే అంటే 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారని.. పదో తరగతి ఎగ్జామ్ సెంటర్ కలిగిన స్కూల్స్ లో భోజనం తర్వాత క్లాసులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
రంజాన్ నెలలో విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు..
మరో రెండ్రోజుల్లో అంటే ఫిబ్రవరి 19 నుండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది... ఈ నెలంతా ముస్లింలు ఉపవాస దీక్ష చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ముస్లిం మైనారిటీ, ఉర్దూ మీడియం స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ నెలరోజులు (ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు) ఉర్దూ మీడియం విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే నడుస్తాయని ప్రకటించింది. మార్చి 20 తర్వాత ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుండి ఎప్పటివరకు..
తెలంగాణలో ఈసారి వేసవి సెలవులు ఏప్రిల్ చివర్లో ప్రారంభం అవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని వెల్లడించింది... అంటే దాదాపు రెండు నెలలు వేసవి సెలవులు ఉండనున్నాయి. జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని... 2026–27 నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
ఉద్యోగులకు రంజాన్ నెలలో ప్రత్యేక అనుమతి...
రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు కూడా ఉపవాస దీక్షలో ఉంటారు... కాబట్టి వీరికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తుంటాయి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే ముస్లింలు ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు సాయంత్రం ఓ గంట ముందుగానే ఆఫీసులు, పని స్థలాల నుండి వెళ్లిపోవచ్చు... ఇలా ప్రార్థన చేసుకునేందుకు, ఉపవాసాన్ని విరమించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నాయి తెలుగు ప్రభుత్వాలు.

