- Home
- Telangana
- IMD Monsoon Rain Alert: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలకు ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
IMD Monsoon Rain Alert: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలకు ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
IMD Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత వేళ ఐఎండీ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎంట్రీ, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

కేరళను తాకిన రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్
నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికే కేరళను బలంగా తాకాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళలో వర్షాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా భారీ మేఘాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు దూసుకొస్తున్నాయి.
ప్రస్తుతం అరేబియా సముద్రం, లక్షద్వీప్, బంగాళాఖాతంలో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ, రాయలసీమ పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, అరేబియా సముద్రంపై తుపాను వలయం ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం ఒక్కసారిగా కూల్ కానుంది. జూన్ 15 నాటికి రుతుపవనాలు నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ, ఈ లోపే ద్రోణుల వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో వానలు.. హైదరాబాద్ వాసులకు అలర్ట్
తెలంగాణలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. గురువారం సాయంత్రం మొదలయ్యే జల్లులు జూన్ 5 తెల్లవారుజాము వరకు కంటిన్యూగా పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లోని పటాన్చెరు, లింగంపల్లి, ఆర్సి పురం, శేరిలింగంపల్లి, కొండాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, తెల్లాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, దమ్మాయిగూడ వంటి ఐటీ కారిడార్, ప్రధాన ప్రాంతాల్లో సాయంత్రం పూట వానలు పడనున్నాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్లో ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ ఉన్నందున, జనాలు తమ ప్రయాణాలను వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో భిన్న వాతావరణం.. ఒకవైపు వానలు, మరోవైపు వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు వర్షాలు ఊరటనిస్తున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి.
అయితే, ఇదే సమయంలో ద్రోణి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో గురువారం సాయంత్రం 3 గంటల తర్వాత నుంచి మేఘాలు కమ్ముకుని వర్షాలు ప్రారంభం కానున్నాయి. అర్థరాత్రి తర్వాత కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాయలసీమ పరిధిలోని చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో రాత్రి వేళల్లో జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు.
అంటార్కిటికా వింత సుడులు.. రుతుపవనాలకు ప్లస్ పాయింట్
అంటార్కిటికా ప్రాంతంలో సడెన్గా భారీ సుడిగుండాలు ఏర్పడ్డాయి. ఇవి విభిన్నమైన రంగుల్లో కనిపిస్తూ, గంటకు ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో భీకరమైన గాలులను సృష్టిస్తున్నాయి. ఈ గాలులు క్రమంగా భూమధ్య రేఖ వైపు దూసుకొస్తున్నాయి.
దీనివల్ల భూమధ్య రేఖా ప్రాంతంలో ఖాళీ ఏర్పడి, అక్కడున్న మేఘాలన్నీ ఇండియా వైపు షిఫ్ట్ అయ్యాయి. జూన్ 10 తర్వాత భూమధ్య రేఖ వద్దకు మళ్లీ కొత్త మేఘాలు వస్తాయి కాబట్టి, నైరుతి రుతుపవనాలు మరింత యాక్టివ్ అయ్యి జూన్ నెలలో ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురిపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
పిడుగుల బీభత్సం.. జాగ్రత్తలు తీసుకోండి
ఐఎండీ రిపోర్ట్ ప్రకారం.. కోస్తాంధ్ర, యానాంలో జూన్ 4 నుంచి 7 వరకు, తెలంగాణలో జూన్ 4 నుంచి 9 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తే, రాయలసీమలో గంటకు 50 కిలోమీటర్లు, కోస్తాంధ్రలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలోని మొత్తం 46 మండలాల్లో తీవ్ర ఉరుములు, 79 మండలాల్లో సాధారణ ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇప్పుడు వస్తున్నవన్నీ క్యుములోనింబస్ మేఘాలు. వీటిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే వీటిలో విద్యుత్ శక్తి జనరేట్ అయ్యి భారీగా మెరుపులు, పిడుగులు పడతాయి.
వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపుల ఎక్కువ ఉండే అవకాశముంది. చెట్ల కింద, కరెంట్ స్తంభాల పక్కన, ఐరన్ హోర్డింగుల కింద అస్సలు నిలబడకూడదు. రైతులు, పశువుల కాపరులు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

