Oneplus: ఇకపై వన్ప్లస్ బ్రాండ్ కనిపించదా.? అసలేం జరుగుతోంది..
Oneplus: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ప్లస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్లు తీసుకొస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఈ కంపెనీకి సంబంధించిన ఇటీవల ఓ వార్త ఇటీవల వైరల్ అవుతోంది.

వన్ప్లస్ మూసివేత అంటూ సోషల్ మీడియాలో ప్రచారం
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ వన్ప్లస్ను మూసివేయబోతున్నారన్న వార్తలు తాజాగా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. కంపెనీ మార్కెట్ విలువ తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న కథనాలు టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా యువతలో, టెక్ అభిమానుల్లో ఈ వార్త ఆందోళన కలిగించింది. భారత్లో వన్ప్లస్కు పెద్ద యూజర్ బేస్ ఉండటంతో ఈ ప్రచారం మరింతగా వైరల్ అయింది.
భారత్లో కార్యకలాపాలు కొనసాగుతాయని కంపెనీ స్పష్టం
ఈ వార్తలపై స్పందించిన వన్ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు స్పష్టత ఇచ్చారు. ఎక్స్ లో స్పందించిన ఆయన, భారత్లో వన్ప్లస్ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. కంపెనీ యథావిధిగా కొనసాగుతుందని, వినియోగదారులు అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. “నెవ్వర్ సెటిల్” అనే వన్ప్లస్ నినాదాన్ని గుర్తు చేస్తూ, బ్రాండ్ భవిష్యత్తుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు.
I wanted to address some misinformation that has been circulating about OnePlus India and its operations.
We’re operating as usual and will continue to do so.
Never Settle. pic.twitter.com/eAGA7iy3Xs— Robin Liu (@RobinLiuOnePlus) January 21, 2026
వన్ప్లస్ నుంచి సబ్బ్రాండ్ ప్రయాణం వరకు
ఒకప్పుడు స్వతంత్ర బ్రాండ్గా ప్రారంభమైన వన్ప్లస్, తన ప్రత్యేక ఫ్లాగ్షిప్ ఫోన్లతో మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కాలక్రమంలో పెరిగిన పోటీ కారణంగా అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో మాతృ సంస్థ బీబీకే ఎలక్ట్రానిక్స్ పరిధిలోని ఒప్పోకు దగ్గరైంది. ప్రస్తుతం వన్ప్లస్ ఒప్పో సబ్బ్రాండ్గా కొనసాగుతూ కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇదే బాటలో రియల్మీ కూడా ఒప్పో గ్రూప్లో భాగమైంది.
అమ్మకాలు, మార్కెట్ వాటాలో తగ్గుదల
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో వన్ప్లస్ గత కొన్నేళ్లుగా తన స్థానం కోల్పోతోంది. భారత్, చైనా కంపెనీకి కీలక మార్కెట్లు. మొత్తం విక్రయాల్లో దాదాపు 74 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తాయి. భారత్లో 2023లో 17 మిలియన్ యూనిట్లుగా ఉన్న విక్రయాలు, 2024 నాటికి 13 నుంచి 14 మిలియన్లకు తగ్గాయి. మార్కెట్ వాటా 6.1 శాతం నుంచి 3.9 శాతానికి పడిపోయింది. చైనాలో కూడా 2 శాతం నుంచి 1.6 శాతానికి తగ్గింది.
భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు
ఈ పరిస్థితుల మధ్య, వన్ప్లస్ను దశలవారీగా ఒప్పోలో పూర్తిగా విలీనం చేస్తారన్న ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం, వన్ప్లస్ ఓపెన్ 2 లాంచ్ను నిలిపివేశారని, వన్ప్లస్ 15ఎస్ ప్రాజెక్ట్ కూడా రద్దయిందని ప్రచారం జరిగింది. దీంతో ఒకప్పుడు హెచ్టీసీ, ఎల్జీ, బ్లాక్బెర్రీ లాంటి బ్రాండ్లు కనుమరుగైనట్లే వన్ప్లస్ కూడా అదే దారిలో వెళ్తుందేమోనన్న భయం టెక్ వర్గాల్లో కనిపించింది. అయితే కంపెనీ అధికారికంగా ఈ ప్రచారాలను ఖండించడం గమనార్హం.

