Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 లో మను భాకర్ ఎందుకు ఆడటం లేదు?
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత్ జట్టులో స్టార్ షూటర్ మను భాకర్ పేరు లేదు. కామన్వెల్త్ గేమ్స్ 2026 లో మను భాకర్ ఎందుకు ఆడటం లేదు? అసలు కారణం ఏమిటి?

స్టార్ షూటర్ మను భాకర్కు దక్కని చోటు.. గ్లాస్గో గేమ్స్లో అసలేం జరిగింది?
కామన్వెల్త్ గేమ్స్ 2026 ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది. స్కాట్లాండ్లోని గ్లాస్గో లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు ఈ క్రీడా సంబరం జరగనుంది. ఈసారి టోర్నీ కోసం భారత్ 126 మంది సభ్యులతో కూడిన బలమైన బృందాన్ని ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత్కు ఇది 19వ భాగస్వామ్యం కావడం విశేషం. ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ ఈవెంట్లలో సత్తా చాటిన మన అథ్లెట్లు, ఈసారి కూడా పతకాల వేటలో ముందుండాలని పట్టుదలతో ఉన్నారు.
కామన్వెల్త్లో భారత్ సాధించిన అద్భుత విజయాలు
1934లో చాలా సాధారణంగా ప్రయాణం ప్రారంభించిన భారత్, కాలక్రమేణా కామన్వెల్త్ దేశాల్లో ఒక ప్రధాన క్రీడా శక్తిగా అవతరించింది. 2022లో జరిగిన బర్మింగ్హామ్ ఎడిషన్లో భారత అథ్లెట్లు ఏకంగా 61 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచారు. చరిత్రాత్మకంగా చూస్తే, కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు అత్యధిక పతకాలు తెచ్చిపెట్టిన క్రీడ షూటింగ్ మాత్రమే. ఇప్పటివరకు మన షూటర్లు 63 స్వర్ణాలు సహా ఏకంగా 135 పతకాలను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. దీని తర్వాత 114 పతకాలతో కుస్తీ (రెజ్లింగ్) రెండో స్థానంలో ఉంది. దిగ్గజ పిస్టల్ షూటర్ జస్పాల్ రాణా ఏకంగా 15 పతకాలు సాధించి, కామన్వెల్త్లో భారత్ తరఫున మోస్ట్ సక్సెస్ఫుల్ అథ్లెట్గా నిలిచారు.
మను భాకర్ అద్భుత ప్రయాణం.. ఒలింపిక్స్ లో మెరిసి
భారత షూటర్లు మెగా టోర్నీలలో ఎప్పుడూ తమ మార్కును చూపిస్తూనే ఉన్నారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించగా, అదే బాటలో నడిచిన మను భాకర్ 2024 పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో గ్లాస్గోకు వెళ్లే 126 మంది భారత జట్టులో మను భాకర్ తోపాటు దేశంలోని ఇతర టాప్ షూటర్ల పేర్లు లేకపోవడం అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.
మను భాకర్ ఎందుకు ఆడటం లేదు?
పారిస్ ఒలింపిక్స్ హీరో మను భాకర్ ఈ టోర్నీలో పాల్గొనకపోవడానికి ఆమె వ్యక్తిగత కారణాలు ఏవీ కావు. నిజానికి, గ్లాస్గో గేమ్స్ షెడ్యూల్ నుంచి షూటింగ్ ఈవెంట్ను పూర్తిగా తొలగించడమే దీనికి అసలు కారణం. 2026 ఎడిషన్లో హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలను పక్కన పెట్టగా, షూటింగ్, ఆర్చరీలను మాత్రం 2022 బర్మింగ్హామ్ గేమ్స్ సమయంలోనే టోర్నీ నుంచి తొలగించారు. ఆ సమయంలో ఆతిథ్య నగరం బర్మింగ్హామ్లో షూటింగ్ పోటీలు నిర్వహించడానికి సరైన మైదానాలు లేదా ఫెసిలిటీస్ లేవు. బడ్జెట్ పరిమితుల వల్ల కొత్త స్టేడియం నిర్మించడం సాధ్యం కాలేదు.
గ్లాస్గో ఎడిషన్లోనూ దక్కని చోటు
కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (CGF) నిబంధనల ప్రకారం, ఆతిథ్యం ఇచ్చే నగరం తమకు అనుకూలమైన నాన్-కంపల్సరీ క్రీడలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ కారణంతోనే షూటింగ్ను పక్కన పెట్టేశారు. మొదట 2026 ఎడిషన్ను ఆస్ట్రేలియాలోని విక్టోరియా నిర్వహించాల్సి ఉండగా, తదనంతర పరిణామాల వల్ల గ్లాస్గోకు మారింది. ఖర్చులు తగ్గించుకోవడానికి పోటీలను వీలైనంత సరళంగా మార్చాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీంతో షూటింగ్ క్రీడ మళ్లీ షెడ్యూల్లోకి రాలేకపోయింది. ఈ కారణంతోనే మను భాకర్ తో పాటు భారత్కు చెందిన ప్రముఖ షూటర్లు ఎవరూ ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో కనిపించడం లేదు.

