Team India: అవన్నీ సెల్ఫిష్ ఆటలే.. సూర్య షాకింగ్ కామెంట్స్.. రోహిత్ ను టార్గెట్ చేశారా?
Suryakumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన '2024 బ్రాండ్ క్రికెట్ పనికిరాదు' అనే వ్యాఖ్యలు రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కామెంట్స్ తో మరో రచ్చ మొదలైంది.

రోహిత్ శర్మపై సూర్యకుమార్ షాకింగ్ కామెంట్స్
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెను సంచలనానికి దారితీశాయి. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించి, వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకున్న ఆనందంలో దేశం ఉండగా, స్కై ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ పాత, కొత్త కెప్టెన్ల మధ్య వారసత్వ యుద్ధానికి తెరలేపింది. ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియా సాధించిన విజయాల క్రెడిట్, జట్టు సంస్కృతి మార్పుపై చేసిన కామెంట్స్ రోహిత్ శర్మ అభిమానులను ఆగ్రహానికి కారణం అయింది.
పాత బ్రాండ్ పనికిరాదు: స్కై సంచలన వ్యాఖ్యలు
ఈ వివాదానికి ప్రధాన కారణం జట్టులో మార్పుల గురించి సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్. గతంలో తాను రోహిత్ శర్మ అడుగుజాడల్లోనే నడుస్తున్నానని చెప్పిన స్కై, ఇప్పుడు మాత్రం పూర్తిగా భిన్నమైన స్వరాన్ని వినిపించారు. "2024 టీ20 ప్రపంచకప్లో మేము ఆడిన విధానం (బ్రాండ్ ఆఫ్ క్రికెట్) ఇకముందు పనికిరాదని మాకు తెలుసు. అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటి నుండి వ్యక్తిగత మైలురాళ్లపై దృష్టి పెట్టకూడదని, కేవలం మ్యాచ్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము," అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ నేతృత్వంలోని 2024 నాటి జట్టు కేవలం గణాంకాల కోసమే ఆడిందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
భారత జట్టులో వైరస్ లాంటి మార్పు
సూర్యకుమార్ యాదవ్ తన నాయకత్వంలో జట్టులో తీసుకొచ్చిన మార్పును వైరస్ తో పోల్చారు. "మీరు గమనిస్తే, సెమీఫైనల్ వరకు మా ఆటగాళ్లలో ఎవరూ టాప్ రన్ గెటర్లు లేదా టాప్ వికెట్ టేకర్లుగా లేరు. కానీ మేము గెలుస్తూనే ఉన్నాము. ప్రతి ఆటగాడు తన వంతు సహకారం అందించాడు. ఈ రకమైన నిస్వార్థ క్రికెట్ సంస్కృతిని 18 నెలల క్రితమే మేము జట్టులోకి తీసుకొచ్చాము. దీనిని జట్టు మొత్తం వైరస్ లాగా వ్యాపింపజేయడం చాలా ముఖ్యం" అని సూర్య పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 2024 జట్టు విజయాలను తక్కువ చేస్తూ మాట్లాడటం సెల్ఫిష్ అని నెటిజన్లు మండిపడుతున్నారు.
కెప్టెన్సీ బాధ్యతలు.. ఊహించని మలుపు
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత తాను కెప్టెన్ అవుతానని ముందుగా అనుకోలేదని సూర్యకుమార్ వెల్లడించారు. "ఆ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీలంక పర్యటనకు వారం ముందు జై షా సర్ ఫోన్ చేసి మీరు టీ20 కెప్టెన్ అని చెప్పారు. ఆ తర్వాత అజిత్ అగార్కర్ కాల్ చేశారు. గౌతమ్ గంభీర్ కోచ్గా వస్తున్నారని నాకు తెలుసు కాబట్టి ఆయనతో కూడా మాట్లాడాను. సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేయమని జై సర్ చెప్పారు. ప్రపంచకప్ గెలవడమే మా ఏకైక విజన్," అని స్కై గుర్తు చేసుకున్నారు.
గంభీర్-సూర్య జైత్రయాత్ర
సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య ఉన్న సమన్వయం జట్టులో పెద్ద మార్పులకు దారితీసింది. కొందరు దీనిని విప్లవాత్మక భాగస్వామ్యం అని కొనియాడుతుంటే, మరికొందరు మాత్రం సూర్యకుమార్ ప్రారంభంలో చూపించిన వినయం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ఆలోచనా విధానంలో 360 డిగ్రీల మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ వేసిన పునాదిని గుర్తించకుండా, అంతా తానే చేశాననే రీతిలో స్కై మాట్లాడుతున్నారని అభిమానులు మండిపడుతున్నారు.
కొత్త ప్రేరణ.. వారసత్వ పోరు
ఆన్లైన్ విమర్శలు ఎలా ఉన్నా, భారత క్రికెట్ ఆధిపత్యమే తన లక్ష్యమని సూర్యకుమార్ స్పష్టం చేశారు. "రోహిత్ భాయ్, జై షా సర్, గౌతీ భాయ్.. సెలెక్టర్లు నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత నాకు కెప్టెన్సీ వస్తుందని ఊహించలేదు. కానీ ఒక ఆటగాడిగా వరల్డ్ కప్ గెలవడం ఒకెత్తయితే, కెప్టెన్గా గెలవడం మరొక ఎత్తు అని నాకు నేను చెప్పుకున్నాను. ఇది నా జీవితంలో పెద్ద ప్రేరణనిచ్చింది," అని ఆయన అన్నారు.

