RCB అమ్మకానికి డేట్ ఫిక్స్.. కోహ్లీ టీమ్ కొత్త ఓనర్ ఎవరు?
RCB : ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీ యాజమాన్య మార్పు తుది దశకు చేరింది. సుమారు 2 బిలియన్ డాలర్ల భారీ ధరకు విక్రయం జరగనుండగా, ఇద్దరు కొనుగోలు రేసులో నిలిచారు. ఈ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆర్సీబీ : డిఫెండింగ్ ఛాంపియన్ల కొత్త ప్రయాణం
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL)లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ, ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. అయితే మైదానంలో ఆట కంటే ముందే, బోర్డు రూముల్లో భారీ వ్యాపార ఒప్పందం తుది దశకు చేరుకుంది. ప్రస్తుత యజమాని డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్) ఈ ఫ్రాంచైజీని విక్రయించేందుకు సిద్ధమైంది.
ఆర్సీబీ అభిమానులకు షాక్
డయాజియో సంస్థ ఈ విక్రయ ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో తొలి మ్యాచ్ ఆడనుంది. సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే సమయంలోనే ఈ భారీ డీల్ చర్చలు వేగం పుంజుకోవడం విశేషం.
రూ. 16,000 కోట్లకు అమ్ముడుపోతున్న బెంగళూరు టీమ్!
ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 16,600 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. 2021లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును రూ. 7,000 కోట్లకు కొనుగోలు చేయగా, ఇప్పుడు ఆర్సీబీ ధర అంతకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఐపీఎల్ బ్రాండ్ విలువను చాటిచెబుతోంది. అయితే, భవిష్యత్తులో మీడియా హక్కుల ధరలపై ఉన్న అనిశ్చితి వల్ల కొంతమంది బిడ్డర్లు వెనకడుగు వేస్తున్నా, ఆర్సీబీకున్న ఫ్యాన్ బేస్ వల్ల భారీ ధర ఖాయమని తెలుస్తోంది.
ఆర్సీబీ కోనుగోలు రేసులో ఇద్దరు ప్రధాన బిడ్డర్లు
ప్రస్తుతం ఆర్సీబీని దక్కించుకోవడానికి ఇద్దరు ప్రధాన పోటీదారులు మిగిలారు.
1. రంజన్ పాయ్ కన్సార్టియం: మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన కోల్బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ తో కలిసి బిడ్ దాఖలు చేశారు.
2. ఈక్యూటీ (EQT): స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ ఒంటరిగా లేదా స్థానిక భారతీయ సంస్థతో కలిసి జట్టును కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది.
ఆర్సీబీ : తప్పుకున్న దిగ్గజాలు.. గ్లేజర్ ఫ్యామిలీ, పూనావాలా
ఈ కొనుగోలు రేసులో ప్రారంభంలో కనీసం ఐదు పార్టీలు ఆసక్తి చూపాయి. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ యజమానులైన గ్లేజర్ ఫ్యామిలీ, అదర్ పూనావాలా గ్రూప్ కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం వీరు ఈ రేసు నుండి తప్పుకున్నారు. 2 బిలియన్ డాలర్ల భారీ విలువను చెల్లించే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీసీసీఐ నిబంధనలు ఏమిటి?
ఒకసారి బిడ్డర్ ఖరారు అయిన తర్వాత, యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తి కావడానికి 45 నుండి 90 రోజులు పడుతుంది. ఈ డీల్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. కాబట్టి, ప్రస్తుత మార్చి గడువు లోపు ఒప్పందం కుదిరినా, అధికారికంగా కొత్త యజమానులు సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026 నాటికి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి?
కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికా ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్ ఈ రేసులో ముందున్నారు. రాజస్థాన్ రాయల్స్ విలువ 1.1 బిలియన్ నుండి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఆదిత్య మిట్టల్ కుటుంబం కూడా ఈ జట్టుపై కన్నేసినట్లు సమాచారం.
వ్యాపార సామ్రాజ్యంగా ఐపీఎల్
ఐపీఎల్ జట్లు ఇప్పుడు కేవలం క్రికెట్ జట్లు మాత్రమే కాదు, అవి గ్లోబల్ స్పోర్ట్స్ బిజినెస్ అసెట్స్గా మారాయి. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, డిజిటల్ వ్యూయర్ షిప్ ద్వారా ఇవి బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాకముందే బోర్డు రూముల్లో జరుగుతున్న ఈ బిలియన్ డాలర్ల బేరసారాలు లీగ్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి.

