IPL 2026 : ఐపిఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సీజన్ ఇదే.. ఇక క్రికెట్ లవర్స్ కి పండగే
Indian Premier League 2026 : ఐపిఎల్ చరిత్రలోనే త్వరలో ప్రారంభంకానున్న సీజన్ 19 ప్రత్యేకంగా నిలవనుంది. గతంలో ఏ సీజన్లో జరగనన్ని మ్యాచులు ఈసారి జరగనున్నాయి. సీజన్ మొత్తం ఎన్ని మ్యాచులుంటాయో తెలుసా..?

ఐపిఎల్ పండగ వచ్చేస్తోంది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)... క్రికెట్ ప్రియులకు పండగ సీజన్ లాంటిది. ఐపిఎల్ కొనసాగే రెండునెలలు యువత లోకల్ క్రికెట్ మజాను ఆస్వాదిస్తారు... ప్రాంతీయ అభిమానం చాటుకుంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలు, ఫోన్లలో క్రికెట్ కామెంటరీ మొదలవుతుంది. ధోని హెలికాప్టర్ షాట్లు, రోహిత్ శర్మ హిట్టింగ్, విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్... ఇలా తమ అభిమాన క్రికెటర్లకు సపోర్ట్ చేస్తూ ఐపిఎల్ ను ఎంజాయ్ చేస్తారు. కోట్లాదిమంది ఇండియన్స్ కి క్రికెట్ మజాను అందించేందుకు మరో ఐపిఎల్ సిద్దమయ్యింది... 19వ సీజన్ ఈ మార్చి 28న ప్రారంభం కానుంది.
ఐపిఎల్ సీజన్ 19 చాలా ప్రత్యేకం గురూ...
డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్లో తలపడతాయి. ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మొదటి దశలో 20 మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందులో 4 డబుల్ హెడర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాత మిగిలిన షెడ్యూల్ను విడుదల చేస్తారు. గత కొన్నేళ్లుగా నాణ్యమైన క్రికెట్, భారీ అభిమానులు, స్టార్ ఆటగాళ్లతో ఐపీఎల్ ప్రపంచంలోనే ప్రీమియర్ టీ20 లీగ్గా ఎదిగింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ టోర్నమెంట్స్ కంటే ఈ 19వ ఐపీఎల్ సీజన్ మరింత ప్రత్యేకంగా నిలవనుంది.
ఐపిఎల్ 2026 ఆరంభానికి ముందే రికార్డులు..
ఐపీఎల్ తొలి సీజన్లో ప్లేఆఫ్స్తో కలిపి 59 మ్యాచ్లు జరిగాయి. 2012 నాటికి జట్ల సంఖ్య పెరగడంతో ఇది 76 మ్యాచ్ల టోర్నమెంట్గా మారింది. 2014 నుంచి 2021 మధ్య ప్రతి సీజన్లో 60 మ్యాచ్లు ఆడగా, 2022 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో 74 మ్యాచ్లకు పెంచారు. అయితే ఈ సీజన్లో మ్యాచుల సంఖ్య మరింత పెరిగింది... 80 లీగ్ మ్యాచ్లు, 4 ప్లేఆఫ్స్తో కలిపి మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం.
2022లో బీసీసీఐ, ఐపీఎల్ కమిటీ జట్ల సంఖ్యను 10కి పెంచాక 2026 నాటికి మ్యాచ్ల సంఖ్యను 84కి పెంచాలని నిర్ణయించాయి. ప్రపంచంలో ఏ ఫ్రాంచైజీ టీ20 లీగ్లోనూ ఒకే సీజన్లో ఇన్ని మ్యాచ్లు జరగవు. అందుకే ఐపీఎల్ 2026 అత్యంత సుదీర్ఘమైన ఎడిషన్గా నిలవనుంది.
రిచ్చెస్ట్ క్రికెట్ టోర్నమెంట్... ఐపిఎల్ విలువెంతో తెలుసా?
ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఫ్రాంచైజీ టీ20 లీగ్గా పేరుగాంచింది. ప్రతి సీజన్లో దాని ఆదాయం, మార్కెట్ విలువ విపరీతంగా పెరుగుతోంది. డిసెంబర్ 2025 రిపోర్ట్స్ ప్రకారం, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు సీజన్ నిలిచిపోవడంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ 20% తగ్గి $9.6 బిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ ఐపీఎల్ మొత్తం వాణిజ్య ఆకర్షణ బలంగానే ఉంది. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, ప్రసార ఒప్పందాల ద్వారా దాని మొత్తం వ్యాపార విలువ $18.5 బిలియన్లకు చేరింది... అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాలా 1,55,000 కోట్ల రూపాయలు. లీగ్ స్టాండలోన్ విలువ $3.9 బిలియన్లు కాగా, ఫ్రాంచైజీల సగటు విలువ $180 మిలియన్లకు పైగా ఉంది. రాబోయే 19వ సీజన్ మైదానంలో, బయట రికార్డులు బద్దలు కొట్టనుంది.
ప్రతి టీం కు రెండు హోం గ్రౌండ్స్..
రాబోయే ఐపీఎల్ సీజన్లో జట్లు తమ హోమ్ మ్యాచ్లను విభజించుకోనున్నాయి. ఒకటి సొంత మైదానంలో, మరొకటి ఇంకో స్టేడియంలో ఆడతాయి. లీగ్ పరిధిని విస్తరించడం, మరిన్ని నగరాలకు క్రికెట్ను తీసుకెళ్లడం, అభిమానులను పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. రాజస్థాన్ రాయల్స్ (జైపూర్, గౌహతి), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు, రాయ్పూర్), పంజాబ్ కింగ్స్ (మొహాలీ, న్యూ చండీగఢ్) లలో మ్యాచ్లు నిర్వహించనున్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం కూడా ఆప్షనల్ గా మరో స్టేడియం ఏర్పాటుకు కారణం. దీనివల్ల షెడ్యూల్ సజావుగా సాగుతుంది. 84 మ్యాచ్ల టోర్నీ కావడంతో ప్రధాన మైదానాల్లో పిచ్ లపై భారం కూడా తగ్గుతుంది.
ఐపిఎల్ లో మొదటిసారి 84 మ్యాచులు..
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా, ఈ లీగ్ పూర్తి రెండు నెలల పాటు జరగనుంది. మార్చి 28 నుంచి మే 31 వరకు అంటే 64 రోజుల పాటు ఈ టోర్నీ ఉంటుంది. 84 మ్యాచ్లను నిర్వహించడానికి, జట్లకు ప్రయాణాల మధ్య తగినంత సమయం ఇవ్వడానికి ఈ ఏర్పాటు చేశారు. 2023లో ఐపీఎల్కు రెండున్నర నెలల ప్రత్యేక విండో లభించింది. ఈ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్లు జరగవు. 2025లో 65 రోజుల విండో ఇచ్చినా, భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా దానిని 74 రోజులకు పొడిగించారు. ఈసారి రెండు నెలలకు పైగా విండోతో 80 లీగ్ మ్యాచ్లు, 4 ప్లేఆఫ్స్తో ఐపీఎల్ 2026 సజావుగా సాగనుంది.
ఐపిఎల్ వేలంలోనే రికార్డు...
ఐపీఎల్ 2026కు ముందు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు, ట్రేడ్ డీల్స్ జరిగాయి. దుబాయ్లో జరిగిన మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా ఎనిమిది జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకున్నాయి. ఈ ఎనిమిది ఫ్రాంచైజీలు కలిసి ట్రేడ్లు, కొనుగోళ్ల కోసం రూ. 54.9 కోట్లు ఖర్చు చేశాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రీ-సీజన్ కార్యకలాపాల్లో ఒకటి. ఇక వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్ల కోసం రూ. 237.55 కోట్లకు గాను రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. కామెరాన్ గ్రీన్ను కేకేఆర్ ఏకంగా రూ. 25.2 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ పరిణామాలన్నీ రాబోయే సీజన్పై అంచనాలను భారీగా పెంచాయి.

