- Home
- Sports
- CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?
CWG 2026: జొన్న పొట్టుపై ప్రాక్టీస్ చేసి.. కామన్వెల్త్ లో రజతం గెలిచాడు.. ఎవరీ సర్వేష్ కుషారే?
Inspiring Journey of Sarvesh Kushare: కామన్వెల్త్ గేమ్స్ 2026లో సర్వేష్ కుషారే హైజంప్లో సిల్వర్ మెడల్ సాధించి రికార్డు సృష్టించారు. 2.25 మీటర్లు దూకి భారత్కు తొలి రజతం అందించారు.అసలు ఎవరీ సర్వేష్ కుషారే?

CWG 2026: కామన్వెల్త్ గేమ్స్లో హైజంప్లో భారత్కు తొలిసారి సిల్వర్ మెడల్.. ఎవరీ సర్వేష్ కుషారే?
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం 10 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. గ్లాస్గోలో జరిగిన పురుషుల హైజంప్ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన సర్వేష్ కుషారే అద్భుత ప్రదర్శన చేశారు.
2.25 మీటర్ల ఎత్తును అధిగమించి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే పురుషుల హైజంప్ విభాగంలో భారత్కు సిల్వర్ మెడల్ రావడం ఇదే తొలిసారి. ఈ చరిత్రాత్మక విజయంతో సర్వేష్ తన గ్రామానికి, దేశానికి ఎంతగానో పేరు తెచ్చారు.
టైట్ కాంపిటీషన్.. కౌంట్బ్యాక్ రూల్తో చేజారిన గోల్డ్
31 ఏళ్ల నేషనల్ రికార్డ్ హోల్డర్ సర్వేష్ కుషారే, జమైకాకు చెందిన రోమైన్ బెక్ఫోర్డ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరు అథ్లెట్లు 2.25 మీటర్ల ఎత్తును సులువుగా దాటేశారు. ఆ తర్వాత ఇద్దరూ 2.28 మీటర్ల ఎత్తును దాటడంలో విఫలమయ్యారు. అయితే, తక్కువ ప్రయత్నాల్లో మునుపటి ఎత్తులను దాటిన ప్రాతిపదికన కౌంట్బ్యాక్ నియమం ప్రకారం జమైకా అథ్లెట్ రోమైన్ బెక్ఫోర్డ్కు గోల్డ్ మెడల్ దక్కింది.
దాంతో సర్వేష్ కుషారే రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్కు చెందిన జాక్ కిమానీ 2.20 మీటర్ల జంప్తో కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలో పాల్గొన్న మరో భారత క్రీడాకారుడు ఆదర్శ్ రామ్ 2.15 మీటర్లు దూకి 5వ స్థానంలో నిలిచాడు.
తేజస్విన్ శంకర్ రికార్డును బ్రేక్ చేసిన సర్వేష్
ఈ విజయంతో సర్వేష్, భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ రికార్డును తిరగరాశారు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించడమే ఇప్పటివరకు హైజంప్లో భారత్కు ఉన్న ఏకైక మెడల్. ఇప్పుడు సర్వేష్ రజతం సాధించి ఆ రికార్డును మరింత మెరుగుపరిచారు. ఇక సోమవారం నాటి పోటీల్లో తేజస్విన్ శంకర్ కూడా పాల్గొన్నారు.
అయితే తొలి ప్రయత్నంలో 2.05 మీటర్ల ఎత్తును దాటలేకపోయిన తర్వాత ఆయన పోటీ నుండి తప్పుకున్నారు. గురువారం నుండి ప్రారంభం కానున్న పురుషుల డెకాథ్లాన్ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉన్నందున, ముందుజాగ్రత్త చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 27 ఏళ్ల తేజస్విన్ వ్యక్తిగత ఉత్తమ రికార్డు 2.29 మీటర్లు కాగా, గత రెండేళ్లుగా ఆయన ప్రధానంగా డెకాథ్లాన్పైనే దృష్టి పెట్టారు.
మొక్కజొన్న పొట్టు, దూదితో ప్రాక్టీస్ చేసిన రైతు బిడ్డ
సర్వేష్ కుషారే ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకమైనది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దేవర్గావ్ అనే గ్రామానికి చెందిన ఉల్లిపాయల రైతు కుమారుడే ఈ సర్వేష్. చిన్నతనంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో, ఆయన తండ్రి స్వయంగా అమర్చిన తాత్కాలిక ల్యాండింగ్ పిట్స్పైనే శిక్షణ తీసుకునేవాడు. మొక్కజొన్న పొట్టు, దూది, వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన పిట్స్పై దుముకుతూ సర్వేష్ ప్రాక్టీస్ చేసేవాడు.
దాదాపు 20 ఏళ్ల వయస్సులో 2014 జూనియర్ ఛాంపియన్షిప్తో జాతీయ స్థాయిలోకి అడుగుపెట్టాడు. 2018 ఇండియన్ ఓపెన్లో 2.24 మీటర్ల జంప్తో తొలి జాతీయ స్వర్ణం సాధించాడు. 2019లో 2.26 మీటర్లు, 2022 గుజరాత్ నేషనల్ గేమ్స్లో 2.27 మీటర్ల రికార్డు నెలకొల్పాడు. 2025 టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్లో 2.18 మీటర్లతో 6వ స్థానంలో నిలిచి, వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
డైమండ్ లీగ్లోనూ సరికొత్త చరిత్ర
సర్వేష్ కుషారే ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో సంచలన ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో మొనాకోలో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మూడో స్థానంలో నిలిచి, డైమండ్ లీగ్ పోడియంపై నిలిచిన తొలి భారతీయ హైజంపర్గా చరిత్ర సృష్టించాడు. అక్కడ ఆయన 2.26 మీటర్ల ఎత్తును దాటారు.
గతంలో నీరజ్ చోప్రా, మురళీ శ్రీశంకర్, వికాస్ గౌడ తర్వాత డైమండ్ లీగ్లో టాప్-3లో నిలిచిన నాల్గవ భారత అథ్లెట్గా నిలిచాడు. అంతేకాకుండా, గతనెల భువనేశ్వర్లో జరిగిన నేషనల్ ఇంటర్-స్టేట్ ఛాంపియన్షిప్లో 2.31 మీటర్ల జంప్తో సరికొత్త జాతీయ రికార్డును కూడా క్రియేట్ చేశాడు. కష్టాలను జయించి కామన్వెల్త్ పీఠంపై రజతం సాధించిన సర్వేష్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

