- Home
- Sports
- Khushi Mukherjee : క్రికెటర్లతో డేటింగ్ ఇష్టం లేదు కానీ సూర్యకుమార్ మాత్రం.. బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
Khushi Mukherjee : క్రికెటర్లతో డేటింగ్ ఇష్టం లేదు కానీ సూర్యకుమార్ మాత్రం.. బాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్
Khushi Mukherjee On Suryakumar : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్ లు చేసేవాడని బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెటర్లతో డేటింగ్ ఇష్టం లేదంటూ ఆమె చేసిన కామెంట్స్ మరో రచ్చ లేపాయి.

సూర్యకుమార్ యాదవ్ నాకు మెసేజ్లు చేసేవాడు: నటి ఖుషీ ముఖర్జీ సంచలనం
భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మాట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాధారణంగా తన అద్భుతమైన బ్యాటింగ్, గ్రౌండ్ లో తన ప్రదర్శన కారణంగా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, ఈసారి ఆయన ఒక భిన్నమైన కారణంతో హాట్ టాపిక్ గా మారాడు. బాలీవుడ్ నటి, మోడల్ ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్, సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్ లు చేసేవాడని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పెళ్లయిన సూర్యకుమార్ యాదవ్పై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అభిమానులకు మింగుడుపడటం లేదు.
ఖుషీ ముఖర్జీ వైరల్ వీడియోలో ఏముంది?
కిద్దాన్ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక ఈవెంట్లో పాల్గొన్న ఖుషీ ముఖర్జీని ఒక రిపోర్టర్, "మీరు ఏవరైనా క్రికెటర్ని డేట్ చేయాలనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. దానికి ఖుషీ స్పందిస్తూ, తనకు క్రికెటర్లతో డేటింగ్ చేయడం పట్ల ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
"నేను ఏ క్రికెటర్ని డేట్ చేయాలనుకోవడం లేదు. నా వెనుక చాలా మంది క్రికెటర్లు పడ్డారు. ఒక క్రికెటర్, సూర్యకుమార్ యాదవ్ నాకు చాలా మెసేజ్లు చేసేవారు. ఇప్పుడు మేము ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు.. నేను అతనితో కనెక్ట్ అవ్వాలనుకోవడం లేదు. నాకు నా గురించి ఎలాంటి లింక్-అప్ వార్తలు రావడం ఇష్టం లేదు" అని ఆమె పేర్కొన్నారు.
అయితే, సూర్యకుమార్ నుండి మెసేజ్ లు వచ్చినా, తమ మధ్య ఎప్పుడూ రొమాంటిక్ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎంటీవీ స్ప్లిట్స్విల్లా, లవ్ స్కూల్ వంటి రియాలిటీ షోల ద్వారా గుర్తింపు పొందిన ఖుషీ, తనకు క్రీడా ప్రపంచంలోని వ్యక్తులతో సంబంధాల పట్ల ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
తిరుమలలో సతీసమేతంగా సూర్యకుమార్ యాదవ్
ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగా, మరోవైపు సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, సూర్యకుమార్ యాదవ్ తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వీరికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సేవలో పాల్గొన్న సూర్య, వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఒకవైపు సూర్యకుమార్ భక్తిభావంతో కుటుంబంతో గడుపుతుండగా, మరోవైపు ఖుషీ ముఖర్జీ వీడియో ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. సూర్యకుమార్ 2016లో దేవిషా శెట్టిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రతిస్పందనలు ఏంటి?
ఖుషీ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ పేరును ప్రస్తావించడం పట్ల చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమె కేవలం ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందనీ, పాపులారిటీ పొందేందుకు సూర్య పేరును వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ క్రికెట్లో తన ఫామ్పై దృష్టి సారిస్తున్నారు. 2025లో ఆయన బ్యాటింగ్ ఫామ్ కొంత ఆందోళనకరంగా మారింది, అతని బ్యాట్ నుండి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ఇలాంటి సమయంలో ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం. అయితే, ఈ విషయంపై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
క్రికెట్, బాలీవుడ్ లింక్-అప్ల చరిత్ర చాలానే ఉంది !
క్రికెటర్లు, సినీ స్టార్ల మధ్య సంబంధాలు లేదా వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా మధ్య జరిగిన వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఊర్వశి రౌతేలా పంత్ గురించి పరోక్షంగా అనేక వ్యాఖ్యలు చేసినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
అలాగే, షర్మిల ఠాగూర్-టైగర్ పటౌడీ, మహమ్మద్ అజారుద్దీన్-సంగీతా బిజిలానీ, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ వంటి జంటలు దశాబ్దాలుగా వార్తల్లో నిలిచారు. కొన్ని జంటలు వివాహం చేసుకుని స్థిరపడగా, మరికొన్ని కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. రవిశాస్త్రి-అమృతా సింగ్, సౌరవ్ గంగూలీ-నగ్మా, యువరాజ్ సింగ్-దీపికా పదుకొనే వంటి వారి పేర్లు కూడా అప్పట్లో టాప్ హెడ్ లైన్స్ లోకి ఎక్కాయి.
రాబోయే సిరీస్ లపై సూర్యకుమార్ యాదవ్ ఫోకస్
వ్యక్తిగత వివాదాలు ఎలా ఉన్నా, సూర్యకుమార్ యాదవ్ కెరీర్ పరంగా కీలక దశలో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన సూర్య, జట్టును 3-1 తేడాతో విజయపథంలో నడిపించారు. రాబోయే జనవరి 2026లో న్యూజిలాండ్తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో కూడా ఆయన జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్కు సన్నాహకంగా ఈ సిరీస్ రెండు జట్లకూ ఎంతో కీలకం కానుంది. ఫామ్ లేమితో సతమతమవుతున్న సూర్యకుమార్, ఈ వివాదాలను పక్కనబెట్టి మైదానంలో తన సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.

