నంబర్ 1 బ్యాటర్కే షాక్: అభిషేక్ కంటే ఎక్కువ రన్స్ చేసిన టాప్-5 అన్సంగ్ హీరోలు
Abhishek Sharma : 2026 టీ20 ప్రపంచకప్లో నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోలేకపోయారు. కానీ అంతగా గుర్తింపు లేని ఐదుగురు ఆటగాళ్లు మాత్రం పరుగుల వరద పారించారు. మరి అభిషేక్ కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆ ప్లేయర్లు ఎవరో తెలుసా?

టీ20 ప్రపంచకప్ 2026: టీమ్ ఇండియా స్టార్ తేలిపోయాడు.. పసికూనల ప్లేయర్లు రెచ్చిపోయారు!
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శన తీవ్ర నిరాశను మిగిల్చింది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించాడు. మెగా టోర్నీకి ముందు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. కానీ, ఐసీసీ టోర్నీలో మాత్రం ఆ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. ముఖ్యంగా ఆరు మ్యాచులు ఆడిన ఆయన కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. 131+ స్ట్రైక్ రేట్తో కేవలం 80 పరుగులు మాత్రమే చేసి, పలు సందర్భాల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
అభిషేక్ శర్మ తన సహజసిద్ధమైన దూకుడును ప్రదర్శించడంలో విఫలమవుతుండగా, మరోవైపు పెద్దగా గుర్తింపు లేని ఇతర దేశాల ఆటగాళ్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అభిషేక్ శర్మ కంటే మెరుగైన పరుగులు చేసిన ఆ ఐదుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్రియన్ బెన్నెట్ (జింబాబ్వే) – 292 పరుగులు
ఈ జాబితాలో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు జింబాబ్వే ఓపెనర్ బ్రియన్ బెన్నెట్. ఈ టీ20 ప్రపంచకప్లో బెన్నెట్ అద్భుతమైన బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆరు మ్యాచుల్లో ఏకంగా 292 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధశతకాలు ఉన్నాయి. ఆయన సగటు 146.0గా ఉండటం గమనార్హం. లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజ జట్లపై జింబాబ్వే సాధించిన విజయాల్లో బెన్నెట్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
2. పవన్ రత్నాయకే (శ్రీలంక) – 205 పరుగులు
శ్రీలంకకు చెందిన టాప్ ఆర్డర్ బ్యాటర్ పవన్ రత్నాయకే కూడా ఈ టోర్నీలో మెరిశాడు. ఇప్పటి వరకు కేవలం 12 టీ20లు మాత్రమే ఆడిన అనుభవం ఉన్న ఈ యంగ్ బ్యాటర్, ఈ వరల్డ్ కప్లో 7 మ్యాచుల్లో 205 పరుగులు సాధించాడు. 154.13 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన రత్నాయకే, రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఒమన్పై చేసిన 60 పరుగులు ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు. శ్రీలంక బ్యాటింగ్ లైనప్లో ఆయన అత్యంత నమ్మదగ్గ ఆటగాడిగా నిలిచాడు.
3. బాస్ డి లీడే (నెదర్లాండ్స్) – 158 పరుగులు
నెదర్లాండ్స్ జట్టు లీగ్ దశలోనే అవుట్ అయినప్పటికీ, ఆ జట్టు ఆల్ రౌండర్ బాస్ డి లీడే తనదైన ముద్ర వేశాడు. నాలుగు ఇన్నింగ్స్లలో 158 పరుగులు చేసిన 26 ఏళ్ల డి లీడే, తన జట్టు తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. నమీబియాపై ఆయన చేసిన 72 (నాటౌట్) పరుగులు నెదర్లాండ్స్ జట్టుకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాయి. జట్టు ఓడినా, డి లీడే పోరాటపటిమ ప్రశంసలు అందుకుంది.
4. యువరాజ్ సామ్రా (కెనడా) – 144 పరుగులు
కెనడా ఓపెనర్ యువరాజ్ సామ్రా ఈ ప్రపంచకప్లో ఒక సంచలన రికార్డును సృష్టించాడు. న్యూజిలాండ్పై అద్భుతమైన సెంచరీ బాది, టీ20 ప్రపంచకప్ హిస్టరీలో అత్యంత పిన్న వయస్సులో (19 ఏళ్లు) సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మొత్తం నాలుగు మ్యాచుల్లో 156.52 స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేశాడు. కెనడా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యువరాజ్ సామ్రా నిలిచాడు.
5. ముహమ్మద్ వసీం (యూఏఈ) – 102 పరుగులు
యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం తన జట్టును ముందుండి నడిపించాడు. మొదటి రౌండ్లోనే ఆ జట్టు నిష్క్రమించినా, వసీం వ్యక్తిగత ప్రదర్శన మెరుగ్గా ఉంది. 4 మ్యాచుల్లో 34.0 సగటుతో 102 పరుగులు చేశాడు. 143.66 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన ఆయన, లీగ్ దశలో న్యూజిలాండ్పై అజేయ అర్ధశతకం సాధించి తన సత్తా చాటాడు. అభిషేక్ శర్మ కంటే తక్కువ మ్యాచులు ఆడినా ఎక్కువ పరుగులు చేయడం విశేషం.
ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా పేరు లేని ఈ ఆటగాళ్లు, ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ కంటే మెరుగ్గా రాణించి తమ ప్రతిభను చాటుకున్నారు. అభిషేక్ శర్మ తన ఫామ్ను తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది.

