T20 World Cup: ఫైనల్కు వచ్చేది ఆ జట్టే.. తాట తీస్తారు కాచుకోండి.! ఇది పే..ద్ద వార్నింగే
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఘోర పరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత, దక్షిణాఫ్రికా కోచ్ శుక్రి కాన్రాడ్ భావోద్వేగంగా స్పందించారు.

దక్షిణాఫ్రికా ప్రయాణం ముగిసింది
టీ20 ప్రపంచకప్ 2026లో అజేయంగా సెమీఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా ప్రయాణం ముగిసింది. మార్చి 4న జరిగిన మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ఫామ్లో ఉన్న ప్రోటీస్ జట్టు, కీలకమైన నాకౌట్ మ్యాచ్లో చేతులెత్తేయడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ ఓటమిపై ఆ జట్టు కోచ్ శుక్రి కాన్రాడ్ ఘాటుగా స్పందించారు.
మ్యాచ్ హైలైట్స్
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ నెమ్మదిగా ఉండటం, న్యూజిలాండ్ స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే, న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసే సమయానికి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారింది. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు దూసుకెళ్లింది.
కోచ్ శుక్రి కాన్రాడ్ ఏమన్నారంటే?
ఓటమి తర్వాత మాట్లాడిన శుక్రి కాన్రాడ్, ఎటువంటి సాకులు చెప్పదలచుకోలేదని స్పష్టం చేశారు. "ఈ రాత్రి మేము ఇంత చెత్తగా ఆడతామని ఊహించలేదు. 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం అనేది చాలా ఘోరమైన విషయం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా తన లీగ్ మ్యాచ్లలో ఎక్కువ భాగం అహ్మదాబాద్లోనే ఆడిందని, పిచ్ పరిస్థితులు మారడం ఓటమికి కారణమై ఉండవచ్చని వస్తున్న విశ్లేషణలను ఆయన కొట్టిపారేశారు. బౌలింగ్, ఫీల్డింగ్లో చేసిన పొరపాట్లే తమను కొంపముంచాయని, ముఖ్యంగా కీలకమైన క్యాచ్లు జారవిడవడం మ్యాచ్ను మలుపు తిప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ అద్భుతంగా ఆడి విజయానికి అర్హత సాధించిందని మెచ్చుకుంటూనే, ఫైనల్ గురించి కాన్రాడ్ ఒక జోస్యం చెప్పారు. ఒకవేళ రెండో సెమీఫైనల్లో గెలిచి భారత్ ఫైనల్కు వస్తే, న్యూజిలాండ్కు ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. టీమిండియా ఉన్న ఫామ్కు కివీస్ జట్టు నిలవడం కష్టమని ఆయన పేర్కొన్నారు.
రెండో సెమీఫైనల్
ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు మార్చి 8న న్యూజిలాండ్తో టైటిల్ పోరులో తలపడనుంది.

