Relationship: సోషల్ మీడియా భార్యా భర్తల మధ్య చిచ్చు పెడుతోందా? నిపుణుల మాట ఇదే!
ప్రస్తుతం సోషల్ మీడియా మన జీవితంలో భాగమైపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు చాలామంది జీవితాలు సోషల్ మీడియా చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇది భార్యాభర్తల మధ్య దూరం పెంచుతోందా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. దానిపై సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

దాంపత్య జీవితంపై సోషల్ మీడియా ప్రభావం
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహాలను కొనసాగించడానికి, వినోదం పొందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ఇదే సోషల్ మీడియా భార్యాభర్తల మధ్య అనుకోని దూరాలను సృష్టిస్తోందా అనే ప్రశ్న ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. మరి దాంపత్య జీవితం మీద సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందో, సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఎమోషనల్ అటాచ్మెంట్ తగ్గే ప్రమాదం
సైకాలజీ నిపుణుల ప్రకారం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతాయి. ఒకప్పుడు రోజువారీ విషయాలు, భావాలు, సమస్యలు గురించి మాట్లాడుకునే సమయం ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది భాగస్వాములు ఫోన్లలో మునిగిపోయి ఉండటం వల్ల ఆ సంభాషణలు తగ్గిపోతున్నాయి.
దీనివల్ల ఒకరిపై ఒకరికి ఉన్న భావోద్వేగ అనుబంధం కొద్ది కొద్దిగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకరు మాట్లాడాలనుకునే సమయంలో మరొకరు ఫోన్లో బిజీగా ఉంటే, నన్ను పట్టించుకోవడం లేదు అనే భావన కలగడం సహజం. ఆ భావన క్రమంగా అసంతృప్తికి, తర్వాత చిన్న చిన్న గొడవలకు దారి తీస్తుందని చెబుతున్నారు.
ఇతరులతో పోల్చుకోవడం
చాలామంది తమ జీవితంలోని సంతోషకరమైన క్షణాలను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తున్నప్పుడు వేరే వాళ్ల జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉందనే భావన కలగవచ్చు. సైకాలజీ నిపుణుల ప్రకారం ఈ పోలికలు మనసులో అసంతృప్తిని పెంచుతాయి. “వాళ్లు సంతోషంగా ఉన్నారు. మనం ఎందుకు లేము?” అనే ఆలోచన తెలియకుండానే మనసులోకి వస్తుంది. ఈ విధమైన పోలికలు భార్యాభర్తల మధ్య అసహనం, అసంతృప్తి పెరగడానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అనవసరమైన అనుమానాలు
అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన అనుమానాలు కూడా సంబంధాలపై ప్రభావం చూపుతాయి. ఎవరో వ్యక్తి చేసిన కామెంట్, లైక్ లేదా చాట్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనుమానాలు మొదలయ్యే అవకాశముంటుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం, మనసులో ఒకసారి అనుమానం మొదలైతే అది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. సరైన కమ్యూనికేషన్ లేకపోతే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
చెడుతో పాటు మంచి కూడా..
మరోవైపు, సోషల్ మీడియా వల్ల మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దూరంగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాల వల్ల వేర్వేరు నగరాల్లో ఉండే దంపతులకు ఇది అనుబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆన్లైన్లో గడిపే సమయాన్ని పరిమితం చేయడం చాలా అవసరం. ఇంట్లో కలిసి ఉన్నప్పుడు ఫోన్లను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి సమయం గడపడం వంటి అలవాట్లు బంధాన్ని బలోపేతం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ బౌండరీలు
కుటుంబంతో ఉండే సమయాల్లో సోషల్ మీడియాను తగ్గించడం చాలా అవసరం. అంటే భోజనం చేసే సమయంలో లేదా నిద్రపోయే ముందు కొంత సమయం ఫోన్లను దూరంగా పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య సంభాషణలు పెరుగుతాయి, పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. అలాగే సోషల్ మీడియాలో చూసిన విషయాల వల్ల మనసులో సందేహాలు కలిగితే వెంటనే గొడవపడకుండా, ప్రశాంతంగా మాట్లాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

