ఓ నగరం నుండి మరో నగరానికి కదిలే ఏటీఎం ... ఇదెలా సాధ్యమో తెలుసా?
ఇండియన్ రైల్వే సరికొత్త ప్రయోగం చేసింది. ప్రయాణ సమయంలో రైలు దిగకుండానే డబ్బులు పొందే ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏకంగా కదిలే రైలులో ఏటిఎంను ఏర్పాటుచేసారు.

ఇక కదిలే రైళ్లలో డబ్బులు డ్రా
ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వేలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా అలాంటి ఓ వినూత్న ప్రయోగమే చేసింది. కదిలే రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. ఇలా ప్రయాణంలో ఉండగానే డబ్బు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో రైలు ప్రయాణ అనుభవాన్నే మార్చేయనుంది.

పంచవటి ఎక్స్ప్రెస్ లో ఏటిఎం
భారతదేశంలో తొలిసారిగా రైలులో ఏటీఎం ఏర్పాటు చేసి విజయవంతంగా ప్రయోగం నిర్వహించారు. మన్మాడ్, ముంబై మధ్య నడిచే పంచవటి ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.
ఏటీఎం ప్రయోగం విశేషాలు
ఏసీ కోచ్లోని ప్యాంట్రీ స్థలంలో ఏటీఎం ఏర్పాటు చేశారు. షట్టర్ డోర్తో భద్రత కల్పించారు. ప్రయోగం సమయంలో కొన్ని నో-నెట్వర్క్ జోన్లలో, ముఖ్యంగా సార, ఇగత్పురి మధ్య సొరంగంలో, స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఏ బ్యాంకు సదుపాయం?
ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎం మెషీన్ను అందించింది. రైలు ప్రయాణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
ఏటీఎం ప్రత్యేకత
రైలు వేగం, ప్రకంపనలను తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. కోచ్లో స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్ మార్పులు చేశారు. సీసీటీవీతో ఏటీఎంను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
ఏటీఎంలు లేని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించేవారికి, అత్యవసర డబ్బు అవసరమైనప్పుడు, దూర ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, వ్యాపార తరగతి ప్రయాణికులకు ఇది గేమ్ ఛేంజర్ అవుతుంది.
ఏటీఎం ఏర్పాటు కోసం మార్పులు
ప్రకంపనలను తట్టుకునే ప్లాట్ఫామ్, విద్యుత్ స్థిరత్వం కోసం అదనపు సపోర్ట్, నెట్వర్క్ కనెక్టివిటీని పెంచడానికి సిగ్నల్ బూస్టింగ్ పరికరాలు ఏర్పాటు చేశారు.