- Home
- National
- Sonagachi: ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా.. దుర్గా దేవీ విగ్రహాల తయారీకి ఈ ప్రాంతం మట్టి. ఎన్నో ఆసక్తికర విషయాలు.
Sonagachi: ఆసియాలో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా.. దుర్గా దేవీ విగ్రహాల తయారీకి ఈ ప్రాంతం మట్టి. ఎన్నో ఆసక్తికర విషయాలు.
Sonagachi: చట్ట విరుద్ధమని తెలిసినా, ప్రమాదకరమని తెలిసినా ఇప్పటికే వేశ్య వృత్తిలో చాలా మంది మగ్గిపోతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కోల్కతాలో ఉందని మీకు తెలుసా? ఈ ప్రాంతానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు..

సోనాగచి
సోనాగచి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోల్కతా నగరంలో ఉన్న ప్రాంతం. ఇది భారతదేశంలోనే అతిపెద్ద, ఆసియాలోకెల్లా పెద్ద రెడ్లైట్ ఏరియాగా ప్రసిద్ధి చెందింది. కోల్కతా నగరంలో ష్యాంబజార్ – బరబజార్ – బెల్గాచియా మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ చిన్నచిన్న వీధులు, పాత ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తాయి. సోనాగచి అంటే "బంగారు చెట్ల తోట" అని పూర్వ అర్థం, కానీ నేటి కాలంలో ఇది ప్రధానంగా వేశ్యావృత్తి ప్రాంతంగా గుర్తింపు పొందింది.
12వేల మంది వేశ్యలు
* సోనాగచిలో సుమారు 10,000 నుం 12,000 వరకు వేశ్యలు నివసిస్తున్నారని అంచనా. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా జోన్.
* 1996లో తీసిన “Born into Brothels” అనే డాక్యుమెంటరీ సోనాగచిలోని పిల్లల జీవితాలను చూపించింది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది.
* ఇక్కడ Durbar Mahila Samanwaya Committee (DMSC) అనే సంస్థ పని చేస్తుంది. ఈ సంస్థ వేశ్యల హక్కుల కోసం, HIV/AIDS అవగాహన కోసం చాలా కృషి చేస్తోంది.
* సోనాగచి HIV/AIDS కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. 1990లలో ఇక్కడ విస్తృత స్థాయిలో వ్యాధి వ్యాప్తి ఉన్నా, DMSC వంటి సంస్థల వల్ల ప్రస్తుతం చాలా తగ్గింది.
* ఇక్కడ వేర్వేరు రాష్ట్రాల నుంచే కాకుండా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి కూడా స్త్రీలు వచ్చి నివసిస్తున్నారు. కాబట్టి సోనాగచిలో బహుభాషా, బహుజాతి సమాజం కనిపిస్తుంది.
దుర్గా దేవీ తయారీకి ఇక్కడి మట్టి
దుర్గాపూజకు విగ్రహం తయారు చేసే సమయంలో ఇక్కడి మట్టి తీసుకెళ్లే సంప్రదాయం ఉంది. దీనిని “పుణ్య మట్టి” అని పిలుస్తారు. ఈ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. విశ్వాసం ప్రకారం.. వేశ్యల గృహానికి వచ్చే మనిషి తన లజ్జ, గౌరవం అక్కడ వదిలిపెడతాడు. ఆ మట్టిని తీసుకువస్తే అది పవిత్రమవుతుందని భావిస్తారు. దుర్గామాత "అన్ని రూపాల్లో ఉంది, అందరినీ అంగీకరిస్తుంది" అనే భావన కోసం ఈ ఆచారం ప్రారంభించారు. శతాబ్దాలుగా ఇది దుర్గాపూజలో భాగం. విగ్రహం తయారుచేసే కుమార్తూలి శిల్పులు (కళాకారులు) ఈ మట్టిని తప్పనిసరిగా కలుపుతారు. దుర్గామాతను స్త్రీ శక్తిగా పూజిస్తారు. కాబట్టి సమాజం విస్మరించిన స్త్రీల గృహాల మట్టిని తీసుకురావడం ద్వారా "శక్తి ఎక్కడైనా ఉంటుంది" అని గుర్తు చేస్తారు. అయితే కాలక్రమేణా ఈ ఆచారం తగ్గుతూ వచ్చింది. ఈ ప్రాంతం నుంచి మట్టి తీసుకెళ్లే ఆచారమైతే ఉంది కానీ వేడుకలకు మాత్రం దూరంగా ఉండేవారు.
2013 నుంచి వేడుకలు
నిజానికి 2013 వరకు ఈ ప్రాంతంలో దుర్గా పూజా చేసే వారు కాదు. కానీ తొలిసారి ఈ ఏడాదిలో సోనాగాచి ప్రాంతానికి చెందిన మహిళలు సొంతంగా దుర్గా పూజా ఉత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ కొంతమంది దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మహిళలు కోల్కతా హైకోర్టును ఆశ్రయించి తమ హక్కులను సాధించుకున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కూడా వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది సరికొత్తగా
సోనాగచి ప్రాంతంలో నివసించే వేశ్యాల పిల్లలు ఈసారి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఇక్కడి పిల్లలపై ఇప్పటివరకు "వేశ్యల పిల్లలు" అనే ముద్ర ఉండేది. కానీ ఈసారి వారు తమ ప్రతిభతో, కళతో కొత్త పండుగను సృష్టించారు. ఈ పండుగకు పేరు “ఛోటోడేర్ దుర్గా, ఛోటోడేర్ మేళా” – అంటే పిల్లల దుర్గాపూజ, పిల్లల జాతర. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, గౌరవాన్ని తిరిగి పొందే ప్రయత్నం. అయితే ఇక్కడ దుర్గామాతకు 20 అడుగుల విగ్రహం లేదు, బంగారు ఆభరణాలు లేవు. ఈ పూజలో దేవతగా నిలబడేది పిల్లలే. వారి నృత్యం, నాటకం, సంగీతం పుష్పాంజలి. వారి స్వరమే మంత్రం, వారి ధైర్యమే శక్తి. "స్కూల్ తర్వాత డాన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ట్యూషన్కి వెళ్ళే మధ్యలో పాటలు రిహార్సల్ చేస్తాం. ఇదే మా పూజ". అని అని 13 ఏళ్ల సుమి చెబుతోంది.
తల్లుల నుంచి పిల్లలకి – పండుగలో మార్పు
గతంలో ఇక్కడి వేశ్యలు తామే దుర్గాపూజ చేసేవారు. సమాజం నిరాకరించినా వారు దేవతను పూజించి తమ గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. ఈసారి మాత్రం బాధ్యత పిల్లల చేతుల్లోకి వచ్చింది. "మా తల్లుల కోసం గౌరవం కోసం పోరాడాం. ఇప్పుడు మా కోసం పోరాడుతున్నాం," అని శ్రేష్ఠా చెబుతుంది. “మేము కూడా మనుషులమే, మాకు కళ ఉంది, కలలు ఉన్నాయి,” అని వారు గర్వంగా చెబుతున్నారు.
ప్రముఖుల హాజరు
సెప్టెంబర్ 22న జరిగిన ప్రారంభోత్సవానికి గాయని ఉషా ఉత్థుప్, మంత్రి శశి పాంజా, ఎంఎల్ఏ దేబాషిస్ కుమార్ వంటి ప్రముఖులు వస్తున్నారు. కానీ అసలు స్టార్లు మాత్రం పిల్లలే. ఇప్పటివరకు పాఠశాలల్లో అవమానం ఎదుర్కొన్న వారికి ఇప్పుడు స్టేజీపై చప్పట్లతో సత్కారం లభించింది. "మా తల్లులు చెడ్డవాళ్లని మమ్మల్ని అవమానిస్తారు. కానీ ఈ పండుగే మా సమాధానం. మేము గర్వంగా ఉన్నాం". అని ఓ చిన్నారి తెలిపింది.
గౌరవం కోసం సాగుతున్న పండుగ
సోనాగచి దుర్గాపూజా కేవలం ఒక ప్రాంతపు పండుగ కాదు. ఇది ఒక ప్రతిఘటన చరిత్ర. మొదట తల్లులు గౌరవం కోసం పూజ మొదలు పెట్టారు. ఇప్పుడు పిల్లలు సమాజంలో తమకూ చోటు కావాలని అదే దీపం వెలిగిస్తున్నారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం జరగాలని, ఇతర స్కూల్ పిల్లల్ని కూడా ఆహ్వానించాలని వారు ఆశిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు సమాజం చూపే చూపు మార్చేస్తాయి. జాలి కాదు, గౌరవం కలిగిస్తాయని
సోషియాలజిస్టులు చెబుతున్నారు.