RBI Rules : మీరు GPay, PhonePe వాడుతున్నారా..? ఇకపై ఇది తప్పనిసరి
డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం OTPతో జరిగే లావాదేవీలకు ఇకపై అదనపు భద్రత ఉండనుంది… ఎలాగో తెలుసా..?

డిజిటల్ చెల్లింపులపై న్యూ రూల్స్..
RBI New Rules : ఇవాళ్టి (ఏప్రిల్ 1, 2026) నుంచి ఆన్లైన్ లావాదేవీలు చేసే విధానం పూర్తిగా మారబోతోంది. డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ను తప్పనిసరి చేసింది. అంటే ఇప్పటివరకు కేవలం వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)తో చేసే లావాదేవీలకు ఇప్పుడు అదనపు సెక్యూరిటీ లేయర్ యాడ్ అవుతోంది.
RBI రూల్స్ ఏంటి..?
ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి కనీసం రెండు రకాల వెరిఫికేషన్స్ అవసరం. కేవలం మెసేజ్లో వచ్చిన OTP ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయడం కుదరదు. ప్రతి లావాదేవీకి ఈ మూడు పద్ధతుల్లో ఏవైనా రెండింటిని ఉపయోగించాలి.
1. పిన్, పాస్వర్డ్ లేదా సీక్రెట్ పాస్ఫ్రేజ్.
2. OTP లేదా హార్డ్వేర్ టోకెన్.
3. వేలిముద్ర, ఫేస్ స్కాన్ లేదా ఐరిస్ స్కాన్.
ఈ నిబంధనలు దేశీయ లావాదేవీలకే కాకుండా అంతర్జాతీయ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి. అయితే అంతర్జాతీయ కార్డు లావాదేవీలకు పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అక్టోబర్ 2026 వరకు గడువు ఇచ్చారు. ఆన్లైన్ మోసాలను తగ్గించడం, డిజిటల్ లావాదేవీలపై ప్రజల నమ్మకాన్ని పెంచడమే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.
కేవలం OTP లపై నమ్మకం ఎందుకు తగ్గింది?
ఇటీవల 'ఫిషింగ్', 'సిమ్ స్వాప్' వంటి మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాల్లో సైబర్ నేరగాళ్లు కస్టమర్ల OTPలను సులభంగా దొంగిలిస్తున్నారు. సిమ్ క్లోనింగ్ ద్వారా మీ ఫోన్కు వచ్చే OTPలను హ్యాకర్లు యాక్సెస్ చేస్తున్నారు. ఇప్పుడు బయోమెట్రిక్స్ లేదా డివైజ్ పిన్తో పాటు OTPని కూడా తప్పనిసరి చేయడంతో, హ్యాకర్లు మోసం చేయడం దాదాపు అసాధ్యం అవుతుంది.
ఏప్రిల్ 1 నుంచి మీ చెల్లింపులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఏప్రిల్ 1, 2026 నుంచి మీరు UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు ఈ మార్పులను గమనిస్తారు.
1. కాస్త అదనపు సమయం : రెండు వెరిఫికేషన్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి పేమెంట్ పూర్తి కావడానికి కొన్ని సెకన్లు ఎక్కువ సమయం పట్టొచ్చు.
2. మెరుగైన భద్రత : మీరు రెగ్యులర్గా వాడే డివైజ్ నుంచి చిన్న మొత్తంలో పేమెంట్స్ చేస్తే, ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. కానీ కొత్త డివైజ్లు లేదా పెద్ద లావాదేవీలను సిస్టమ్ మరింత నిశితంగా పరిశీలిస్తుంది.
3. జవాబుదారీతనం : బ్యాంకులు, పేమెంట్ ప్లాట్ఫామ్లకు ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. ఒకవేళ సిస్టమ్ వైఫల్యం వల్ల మోసం జరిగితే బ్యాంకు కస్టమర్కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

