ప్రపంచానికి తెలియని యోధుడు.. 26/11 దాడిలో 157 మందిని రక్షించిన వీరుడి గురించి తెలుసా?
Ravi DharniDharka: 26/11 ముంబై దాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారు. అయితే ఈ సమయంలో విరోచితంగా పోరాడి 150 మందిని రక్షించిన ఓ వీరుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర మరువని గాయం
2008 నవంబర్ 26. ముంబై నగరం ఉగ్రవాదుల దాడులతో అగ్నిగుండంగా మారింది. లష్కర్-ఏ-తోయ్బా దాడుల్లో 4 రోజుల పాటు భయం, గందరగోళం. మొత్తం 159 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజ్ ప్యాలెస్ హోటల్ ఈ దాడుల కేంద్రంగా మారింది. ఈ సమయంలో హోటల్లో ఉన్న ఓ వ్యక్తి అసాధారణ ధైర్యం చూపించారు. ఆయనే అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ కెప్టెన్ రవి ధర్నిధిర్క.
ఎవరీ రవి ధర్నిధిర్క.?
రవి ఇరాక్ యుద్ధంలో 200 పైగా యుద్ధ మిషన్లను పూర్తి చేశారు. ఫలూజా వంటి ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేశారు. 26/11 ఘటన జరిగిన సమయానికి ఆయన తన కుటుంబంతో సెలవుల్లో ముంబై వచ్చారు. అదే రాత్రి, తాజ్ హోటల్ పై అంతస్తులో ఉన్న సూక్ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నారు. ఒక్కసారిగా రెస్టారెంట్ లోని ఫోన్లు మోగాయి. హోటల్ లో కాల్పులు జరిగిన విషయం తెలిసింది.
ప్రాణాలు కాపాడేందుకు ప్రణాళిక
రవికి అక్కడే ఉన్న సౌతాఫ్రికా మాజీ కమాండోలకు తోడయ్యారు. మొదట వారు రెస్టారెంట్ లో ఉన్న గాజు తలుపులు ప్రమాదం అని గుర్తించారు. ఒక గ్రెనేడ్ పడితే అందరూ ప్రమాదంలో పడతారని ఆలోచించి వెంటనే ఫ్లోర్ పరిశీలించారు. పెద్ద పెద్ద టేబుల్స్ తో మెట్ల దారిని బ్లాక్ చేశారు. అక్కడున్న వారందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్ కు మార్చారు. అందరినీ తమ ఫోన్లు సైలెంట్ లో పెట్టమన్నారు. అక్కడ ఉన్నవారు కత్తులు, ఇనుప రాడ్లు వంటి వస్తువులను తీసుకున్నారు. అవి రైఫిళ్ల ముందు చిన్నవని తెలిసినా.. వారు భయపడలేదు.
అగ్నిజ్వాలల్లో చిక్కుకున్న 157 మంది
కొన్ని గంటల తరువాత హోటల్ లో పేలుళ్లు జరిగాయి. మంటలు పై వరకు వ్యాపిస్తున్నాయి. ఇక సమయం లేదన్న విషయం రవికి అర్థమైంది. పూర్తిగా నిశ్శబ్దంగా, ఒక్క అడుగు కూడా శబ్దం చేయకుండా, వారు మెట్ల ద్వారా కిందికి దిగడం మొదలుపెట్టారు. మహిళలు, పిల్లలు ముందుగా.. తరువాత పురుషులు చివరిలో కాపలాగా రవి వెళ్లడం మొదలు పెట్టారు. మధ్యలో 84 ఏళ్ల మహిళ అలసిపోయింది. ఆమెను వదిలేయమని చెప్పినా, రవి ఆమెను తన భుజాలపై మోసుకెళ్లారు.
ఒక అసాధారణ వీరగాథ
చివరకు మెట్ల దారి నుంచి వారు బయటకు వచ్చారు. 157 మంది ప్రాణాలు రవి ధర్నిధిర్క ధైర్యం, తెలివైన నిర్ణయాలు కాపాడాయి. ఈ సంఘటన 26/11 దాడుల్లో మరచిపోలేని వీరగాథగా నిలిచింది.

