- Home
- National
- Pathole road : మీ వాహనం పాడయ్యిందా? ప్రభుత్వం నుండి రిపేర్ ఖర్చులు పొందవచ్చు.. ఎలాగో తెలుసా?
Pathole road : మీ వాహనం పాడయ్యిందా? ప్రభుత్వం నుండి రిపేర్ ఖర్చులు పొందవచ్చు.. ఎలాగో తెలుసా?
Pathole road : అద్వాన్నమైన రోడ్ల కారణంగా మీ వాహనాలు డ్యామేజ్ అవుతున్నాయా? అయితే ప్రభుత్వం నుండే మీ వెహికిల్ రిపేర్ ఖర్చులను పొందవచ్చు... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రభుత్వంపై ఫైన్ వేయవచ్చా?
Pathole road : మనం బైక్ లేదా కారులో బయటకు వచ్చామంటే ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాల్సిందే... హెల్మెట్ లేకున్నా, సీటు బెల్ట్స్ పెట్టుకోకున్నా, సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్ లో నడిపినా ప్రభుత్వానికి ఫైన్ కట్టాల్సిందే. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలని... తప్పులు చేయకుండా ప్రమాదాలను నియంత్రించాలని ఈ రూల్స్ పెట్టారు. అయితే కేవలం ప్రజలే కాదు పాలకులు, అధికారులు కూడా ప్రజా సంరక్షణ విషయంలో అంతే బాధ్యతగా ఉండాలి. అలా లేకుంటే మనకు ఫైన్ వేసినట్లే వారికి ఫైన్ వేయవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
రిపేర్ డబ్బులు ప్రభుత్వం నుండే పొందండి
రోడ్డుపై గుంతల వల్ల మీ వాహనానికి ఏదైనా నష్టం జరిగితే ఆ రిపేర్ డబ్బులను ప్రభుత్వం నుండి వసూలు చేసుకోవచ్చు. 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో ఇలాంటి నియమం ఉంది. మనం ప్రభుత్వానికి జీఎస్టీ, రోడ్డు పన్ను, ఇంధన పన్ను చెల్లిస్తాం... ఇందుకుగాను ప్రభుత్వం మెరుగైన రోడ్డు రవాణా సదుపాయాలు కల్పించాలి. అలాకాకుండా వినియోగదారులకు సరైన రోడ్డు సదుపాయం కల్పించకుంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఇలా రోడ్డుపై గుంతల వల్ల వాహనాలకు నష్టం జరిగితే ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని 2019 వినియోగదారుల రక్షణ చట్టంలో ఉంది.
వినియోగదారుల కోర్టులో కేసు నమోదు చేయండి
వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద భారత పౌరులు గుంతల వల్ల కలిగే వాహన నష్టానికి పరిహారం పొందడానికి వినియోగదారుల కేసును దాఖలు చేయవచ్చు. సురక్షితమైన రోడ్లను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే అది సేవలో లోపంగా పరిగణిస్తారు. అయితే దారుణమైన రోడ్ల వల్ల మీకు నష్టం జరిగితే ఆ గుంతల రోడ్లను, వాటివల్ల జరిగిన నష్టాలను ఫొటోల వంటి ఆధారాలు సేకరించాలి. వీటి ఆధారంగా మున్సిపాలిటీ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. తర్వాత వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ లేదా వినియోగదారుల కమిషన్ ద్వారా లాయర్ అవసరం లేకుండానే కేసు నమోదు చేయవచ్చు.
రోడ్డుపై గుంతల వల్ల కలిగిన నష్టానికి వినియోగదారుల హక్కును క్లెయిమ్ చేసే పద్ధతులు:
ముందుగా మీకు కలిగిన నష్టాలకు సంబంధించి ఆధారాలు సేకరించండి. గుంతల స్పష్టమైన ఫొటోలు, మీ వాహనానికి జరిగిన నష్టం ఫొటోలు తీయండి. మీ వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్తో సహా సంఘటన జరిగిన కచ్చితమైన సమయం, ప్రదేశాన్ని రాసి పెట్టుకోండి.
అధికారికంగా ఫిర్యాదు చేయండి:
మీ నగర మున్సిపాలిటీ వెబ్సైట్ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసినందుకు రుజువుగా ఆ ఫిర్యాదు స్క్రీన్షాట్ లేదా రసీదు తీసుకోండి.
లీగల్ నోటీసు పంపండి
రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ చిరునామా ఉంటే లేదా మున్సిపల్ సంస్థకు లీగల్ నోటీసు పంపవచ్చు.
జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ వెబ్సైట్ ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఒక వేదికను అందిస్తుంది.
వినియోగదారుల కేసు నమోదు చేయండి:
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద వినియోగదారుల కమిషన్లో కేసు నమోదు చేయండి.
మీకు లాయర్ అవసరం లేదు. రోడ్డు ఫొటోలు, నష్టం, అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలతో మీరు కేసు నమోదు చేయవచ్చు.
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ఎవరికి వర్తిస్తుంది
సేవలో లోపం:
సురక్షితమైన, సరైన రోడ్లను నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత. గుంతల వల్ల సరిగా నిర్వహించని రోడ్లను "సేవలో లోపం"గా పరిగణిస్తారు. ఇది ఈ చట్టం పరిధిలోకి వస్తుంది.
వినియోగదారుల హక్కులు:
పన్ను చెల్లింపుదారులుగా, పౌరులకు సరైన రోడ్డు మౌలిక సదుపాయాలు పొందే హక్కు ఉంటుంది. రోడ్డు లోపాల వల్ల నష్టం జరిగితే న్యాయమైన పరిహారం పొందే హక్కు కూడా ఉంటుంది.
సులభమైన ప్రక్రియ:
వినియోగదారుల రక్షణ చట్టం, 2019, ఆన్లైన్ ఫిర్యాదు దాఖలు, మధ్యవర్తిత్వం వంటి ఎంపికలతో సులభమైన, వేగవంతమైన వివాద పరిష్కార విధానాన్ని అందిస్తుంది. ఇది వినియోగదారులకు పరిహారం పొందడాన్ని సులభతరం చేస్తుంది.
వినియోగదారుల హక్కులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.