PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ఫొటోలు ఎంత బాగున్నాయో చూశారా.?
దేశవ్యాప్తంగా రక్షా బందన్ వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు తమ సోదరులకు రాఖీ కట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

విద్యార్థులు, బ్రహ్మకుమారి ప్రతినిధులు
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా, ఆగస్టు 9వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీలోని ప్రధాని నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారి ప్రతినిధులు ప్రత్యేకంగా హాజరై మోదీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా పిల్లల ఆనందం, మోదీ సంతోషం కలగలిపిన ఆ క్షణాలు హృదయాన్ని హత్తుకునేలా మారాయి.
ఆప్యాయతగా ముచ్చటించిన ప్రధాని
రాఖీ కార్యక్రమం అనంతరం, మోదీ అందరితో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలు, ఆసక్తుల గురించి తెలుసుకున్నారు. చిన్నారులతో సరదాగా మాట్లాడారు. ఈ హాస్యభరిత క్షణాలు అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు
ప్రధాని నివాసంలో జరిగిన ఈ రాఖీ వేడుకల ఫొటోలు, వీడియోలు కాసేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మోదీ చిరునవ్వుతో పిల్లలతో రాఖీ కట్టించుకుంటున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
వేడుకలకు ముందు మోదీ దేశ ప్రజలకు ఎక్స్ ద్వారా సందేశం పంపారు. “రక్షా బంధన్ సోదర సోదరీమణుల మధ్య అపారమైన ప్రేమకు ప్రతీక. ఈ పండుగ బంధాలను మరింత బలపరుస్తూ, ప్రేమ, సౌహార్దం, ఆనందాన్ని పెంచాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు.
పండుగ సంప్రదాయానికి ప్రధాని ప్రాధాన్యం
గతంలో కూడా మోదీ రక్షా బంధన్ రోజున పాఠశాల విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఆయనకు రాఖీ కట్టడం, ఆప్యాయంగా ముచ్చటించడం ద్వారా పిల్లలు, మహిళలు తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.