PM Modi: మరో మైలు రాయి సొంతం చేసుకున్న మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో మైలు రాయిని దాటేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలైన మోదీ ప్రస్థానం నేడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగింది. ఈ క్రమంలోనే తాజాగా భారత రాజకీయాల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

అత్యంత ఎక్కువ పదవీకాలం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో మరో ముఖ్యమైన ఘట్టాన్ని సాధించారు. వరుస పదవీకాలాల్లో రెండో అత్యంత కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరిట ఉండగా, మోదీ దాన్ని అధిగమించారు.
ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన మోదీ
ఇందిరా గాంధీ వరుస పదవీకాలాల్లో 11 సంవత్సరాలు 59 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు ఆమె దేశాన్ని నడిపించారు. ఇక మోదీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటివరకు 11 సంవత్సరాలు 60 రోజులు పూర్తి చేశారు. దీంతో ఇందిరా రికార్డును అధిగమించారు.
నెహ్రూ తర్వాత మోదీ
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాలు 286 రోజులు వరుసగా ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత ఇంతకాలం వరుసగా పనిచేసిన నాయకుడు మోదీ నిలిచారు. ప్రత్యేకత ఏమిటంటే మోదీ స్వాతంత్రం తర్వాత పుట్టిన తొలి ప్రధానమంత్రి, అలాగే హిందీ భాషేతర రాష్ట్రం నుంచి ఇంతకాలం పదవిలో ఉన్న తొలి నాయకుడుగా నిలిచారు.
మోదీ రాజకీయ ప్రయాణం
నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ నుంచి 2014 మే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 2014, 2019 లో వరుసగా రెండు సార్లు లోక్సభ ఎన్నికల్లో బీజేపీని పూర్తి మెజారిటీతో గెలిపించారు. స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ తప్ప మరే పార్టీ కూడా ఇంత భారీ విజయం సాధించలేదు.
ప్రముఖ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు
మోదీ నాయకత్వంలో Article 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, వక్ఫ్ సవరణ చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సబ్ కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో మోదీ ప్రభుత్వం ప్రతి వర్గానికీ అభివృద్ధి అందించేలా చర్యలు చేపట్టింది.
నితి ఆయోగ్ నివేదిక ప్రకారం గత 9 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ విజయానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న పథకాలు, పేదలకు చేరువైన సంక్షేమ చర్యలే కారణం అని అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసించాయి.