- Home
- National
- IRCTC : ఏప్రిల్ 1 నుండి రైల్వేలో కొత్త రూల్స్.. టికెట్ బుకింగ్ నుండి రిఫండ్ వరకు అన్నీ మారాయి !
IRCTC : ఏప్రిల్ 1 నుండి రైల్వేలో కొత్త రూల్స్.. టికెట్ బుకింగ్ నుండి రిఫండ్ వరకు అన్నీ మారాయి !
IRCTC New Rules April 2026 : ఇండియన్ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ లో కొత్త మార్పులు తెచ్చింది. రైల్వే టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ నిబంధనలను ఏప్రిల్ 1 నుండి మారుస్తోంది. నిర్ణీత సమయం దాటితే కన్ఫర్మ్ టికెట్పై రూపాయి కూడా రిఫండ్ రాదు.

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో మార్పులు
రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడం కోసం భారతీయ రైల్వే కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ కన్ఫర్మేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి రైల్వే శాఖ టికెట్ క్యాన్సిలేషన్, రిఫండ్ నిబంధనలలో భారీ మార్పులను ప్రకటించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, మీరు టికెట్ క్యాన్సిల్ చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే, అంత ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది.
Indian Railways New Ticket Rules : ఏప్రిల్ 1 నుంచి రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తే చుక్కలే
కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు మీరు మీ కన్ఫర్మ్ టికెట్ను క్యాన్సిల్ చేస్తే, మీకు ఎటువంటి రిఫండ్ లభించదు. అంటే మీ టికెట్ మొత్తం డబ్బును రైల్వే శాఖకు వదులుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది, కానీ ఇప్పుడు దానిని 8 గంటలకు పెంచారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలో మార్పు ఉంటే ముందుగానే నిర్ణయం తీసుకోవాలని రైల్వే సూచిస్తోంది.
Indian Railways New Ticket Rules : సమయాన్ని బట్టి కట్ అయ్యే చార్జీలు
రైలు టికెట్ క్యాన్సిలేషన్ సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తంలో మార్పులు ఉంటాయి..
• 72 గంటల కంటే ముందు: రైలు బయలుదేరడానికి 72 గంటల కంటే ముందే టికెట్ రద్దు చేస్తే, కేవలం నిర్ణీత ఫ్లాట్ క్యాన్సిలేషన్ చార్జీలు మాత్రమే కోత పడతాయి. మిగిలిన మొత్తం రీఫండ్ అవుతుంది.
• 72 నుండి 24 గంటల మధ్య: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే, మీ టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు.
• 24 నుండి 8 గంటల మధ్య: రైలు బయలుదేరడానికి 24 గంటల నుండి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే, టికెట్ ధరలో 50 శాతం మొత్తాన్ని రైల్వే కట్ చేసుకుంటుంది.
• 8 గంటల లోపు: పైన పేర్కొన్న విధంగా, 8 గంటల కంటే తక్కువ సమయం ఉంటే సున్నా రిఫండ్ లభిస్తుంది.
IRCTC : బోర్డింగ్ పాయింట్, TDR నిబంధనలలో మార్పు
ప్రయాణికుల సౌలభ్యం కోసం బోర్డింగ్ పాయింట్ మార్చుకునే నిబంధనను రైల్వే మరింత ఈజీగా మార్చింది. ఇప్పుడు ప్రయాణికులు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. గతంలో ఈ సదుపాయం చార్ట్ తయారీకి ముందు మాత్రమే అందుబాటులో ఉండేది. అలాగే, ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టీడీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. ఆన్లైన్ టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఆటోమేటిక్గా ప్రయాణికుల ఖాతాలోకి చేరుతుంది.
రైల్వే తత్కాల్ బుకింగ్, ఆధార్ లింక్ రూల్స్ ఇవే
టికెట్ బుకింగ్లో పారదర్శకత కోసం ఐఆర్సిటిసి (IRCTC) ఖాతాను ఆధార్తో అనుసంధానం చేయడం ఇప్పుడు తప్పనిసరి. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా, టికెట్ దళారుల ఆగడాలను అరికట్టడానికి, బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల వరకు ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేయడాన్ని రైల్వే నిషేధించింది. తద్వారా సామాన్య ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది.
నకిలీ అకౌంట్లపై వేటు.. చార్ట్ తయారీ సమయం మార్పు
రైల్వే టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు రైల్వే శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 3 కోట్ల నకిలీ అకౌంట్లను రైల్వే రద్దు చేసింది. అలాగే రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయంలో కూడా మార్పులు చేసింది. గతంలో 4 గంటల ముందు తయారయ్యే చార్ట్, ఇప్పుడు 9 నుండి 18 గంటల ముందే సిద్ధం చేయనున్నారు. దీనివల్ల ప్రయాణికులకు వారి సీటు కన్ఫర్మేషన్ గురించి ముందుగానే స్పష్టత వస్తుంది. ఏప్రిల్ 1 నుండి 15 మధ్య ఈ కొత్త నిబంధనలన్నీ పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి.

