ప్రధాని మోడీని చంపుతాం.. లష్కరే తోయిబా వార్నింగ్.. వీడియో వైరల్
Warning to kill Modi: పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అధినేత, ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. ప్రధాని మోడీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Lashkar -e -Taiba chief Hafiz Saeed Warning to kill Modi: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని గుర్తించిన భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటోంది.
1960 సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ కు అన్ని వివరాలు అందించినట్టు సమాచారం. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దుతో పాటు భారత్ కు గగనతలం మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సరిహద్దులకు యుద్ధ విమానాలు మోహరించడం, పాక్ నేతల వ్యాఖ్యలతో భారత్ ను మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.
దీంతో భారత్ పాకిస్తాన్ తో అన్ని ఒప్పందాలు కట్ చేసుకోవడంతో పాటు దేశంలో ఉన్న పాకిస్తానీలు వెంటనే వెళ్లిపోవాలనీ, వారి వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా ఇప్పుడు సింధు జలాల విషయం హాట్ టాపిక్ గా మారింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే, సింధు నదిపై అధికంగా ఆధారపడే పాకిస్తాన్ నీటి కొరతతో అల్లాడే పరిస్థితిలోకి జారుకుంటుంది.
ఈ క్రమంలోనే గతంలో సింధు జలాల విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు పెరిగినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన పాత వీడియోలు వైరల్ గా మారాయి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గతంలో మోడీ శ్వాస ఆపుతామంటూ హెచ్చరికలు చేశారు. "మీరు పాకిస్తాన్కు నీళ్లు ఆపితే, మేము మీ శ్వాస ఆపుతాం" అంటూ కామెంట్స్ చేశాడు.
"మీరు కాశ్మీర్ లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం.. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుందంటూ" హఫీజ్ గతంలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఉగ్రవాదులు ఇప్పుడు ఆ వీడియోను వైరల్ చేస్తూ పాకిస్తానీలను రెచ్చగొడుతున్నారని సమాచారం.
భారత్-పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం ఏమిటి?
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ లు సింధు జలాలపై సంతకం చేశారు. ఇందులో తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్పై పాక్కు ఎక్కువ హక్కులు ఇచ్చారు. భారత్ ఈ నదులపై కేవలం నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తి కోసం పరిమిత ప్రాజెక్టులు చేపట్టగలదు.