Gig Workers: డిసెంబర్ 31న జొమాటో, స్విగ్గీ సేవల్ బంద్.. కారణం ఏంటంటే.?
Gig Workers: న్యూఇయర్ కోసం అంతా సిద్ధమవుతున్నారు. సాధారణ రోజులతో పోల్చితే ఇయర్ ఎండ్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతుంది. అయితే తాజాగా గిగ్ వర్కర్లు వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు.

ఆన్లైన్ డెలివరీలపై ప్రభావం
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఇళ్లలో పార్టీలు, ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్, ఫుడ్ ఆర్డర్లు వంటి వాటితో సంవత్సరం చివరి రోజు సందడిగా ఉంటుంది. అయితే ఈసారి డిసెంబర్ 31న ఆ ఆనందానికి బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గిగ్, డెలివరీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో ఆన్లైన్ డెలివరీ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
స్విగ్గీ, జొమాటో సహా ఈ–కామర్స్ సేవలపై ప్రభావం
డిసెంబర్ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్లలో పని చేసే డెలివరీ కార్మికులు పనికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే డిసెంబర్ 25న జరిగిన నిరసనకు కొనసాగింపుగా ఈ సమ్మెను మరింత తీవ్రంగా చేపట్టాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. న్యూ ఇయర్ ఈవ్ రోజున సాధారణ రోజుల కంటే ఆర్డర్లు భారీగా పెరుగుతాయి. అలాంటి సమయంలో డెలివరీలు నిలిచిపోతే వినియోగదారులు, వ్యాపారాలు రెండింటికీ ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.
ఎందుకు సమ్మె? కార్మికుల ఆవేదన ఏంటి.?
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ విడుదల చేసిన ప్రకటనలో కార్మికుల సమస్యలను వివరించారు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తోందని, కానీ దానికి తగిన వేతనం లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఆదాయం, పెరిగిన పని భారం, భద్రత లోపించడం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని సంఘాలు చెబుతున్నాయి.
హోటళ్లు, రెస్టారెంట్లపై భారీ ఎఫెక్ట్
డిసెంబర్ 31న ఫుడ్ ఆర్డర్లు భారీగా ఉంటాయి. ఈ సమ్మె కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టాల్స్ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే కూరగాయలు, గ్రోసరీ సరఫరా చేసే క్విక్ కామర్స్ సేవలపై కూడా ప్రభావం పడనుంది. ఇళ్లలో పార్టీలు చేసుకునే వారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో ఆర్డర్లు పెట్టేవారికి ఈ సమ్మె పెద్ద షాక్గా మారనుంది.
గిగ్ కార్మికుల డిమాండ్లు ఏంటంటే.?
గిగ్ కార్మికులు మొత్తం తొమ్మిది కీలక డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు.
* న్యాయమైన, స్పష్టమైన వేతన విధానం అమలు చేయాలి.
* 10 నిమిషాల డెలివరీ వంటి ఒత్తిడిని కలిగించే విధానాలను రద్దు చేయాలి.
* ఐడి బ్లాక్, జరిమానాల విషయంలో సరైన ప్రక్రియ ఉండాలి.
* పని సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరి చేయాలి.
* అల్గోరిథంల ద్వారా వివక్ష ఉండకూడదు.
* ప్లాట్ఫామ్లు, కస్టమర్లు కార్మికులను గౌరవంగా చూడాలి.
* స్థిర పని గంటలు, విశ్రాంతి సమయాలు ఉండాలి.
* యాప్, చెల్లింపులు, రూటింగ్ సమస్యలకు బలమైన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి.
* హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద కవరేజ్, పెన్షన్ వంటి సామాజిక భద్రత కల్పించాలి.
ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్లాట్ఫామ్ కంపెనీలను నియంత్రించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

