Free Bus for Men's : తెలుగు మహిళలకే కాదు.. పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం...!
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో పురుషులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారా..?

పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణ హామీ...
మొదట తమిళనాడు ఎన్నికల్లోనే (2021) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ వినిపించింది... అధికారంలోకి రాగానే ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) దీన్ని అమలు చేసింది. తర్వాత తెలంగాణ ఫాలో అయ్యింది... ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కూడా అమలుచేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే పథకాలు తమిళనాడు నుండి స్పూర్తి పొందినవే.
అయితే ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తోంది. అంటే ఈ పార్టీ అధికారంలోకి వస్తే తమిళనాడులో ఎవ్వరూ టికెట్ అవసరమే లేకుండా ఆర్టిసి బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు.
అన్నాడీఎంకే ఈ ఎన్నికల హామీపై కొందరు తెలుగు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు... ఈ హామీని కూడా తెలుగు రాష్ట్రాలు ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులకు ఉచిత బస్సు హామీ ఇవ్వాలంటూ సరదాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి హామీ ఇస్తారా..?
ఇప్పటికే మహిళల మాదిరిగానే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలనే డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. దీనికి తమిళనాడు ఎన్నికల హామీ మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సరదాగా సాగుతున్న చర్చ భవిష్యత్ లో సీరియస్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో గెలుపుకోసం ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు కూడా పురుషులు ఆర్టిసి బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేలా చూస్తామంటూ హామీ ఇచ్చినా ఇవ్వవచ్చు.
తమిళనాడులో ఎన్నికల హడావిడి...
ఇదిలావుంటే ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్ అయ్యాయి… అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి ఖజగం (TVK) పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు తప్పేలా లేదు. ఈ క్రమంలో గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు.
తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే తన మేనిఫెస్టోను విడుదల చేసి రాజకీయంగా సంచలనం రేపింది. "ప్రజల కోసం మనం, ప్రజలతోనే మనం" అనే నినాదంతో ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇందులో సామాన్యులను ఆకట్టుకునేలా అదిరిపోయే మెగా హామీలు ఉన్నాయి.
రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ ఫ్రిజ్..
అన్నాడిఎంకే మేనిఫెస్టోలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ప్రధాన హామీ ఇదే. తమిళనాడులోని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచితంగా ఫ్రిజ్ (రిఫ్రిజిరేటర్) ఇస్తామని ప్రకటించింది ప్రతిపక్ష పార్టీ. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇచ్చిన మిక్సీ, గ్రైండర్ పథకాలకు కొనసాగింపుగా ఈ హామీని చూస్తున్నారు. మహిళల ఇంటి పని భారాన్ని తగ్గించడంతో పాటు, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నాడీఎంకే చెబుతోంది.
వైద్యవిద్యలో 10% రిజర్వేషన్లు...
గతంలో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం వైద్యవిద్యలో 7.5% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు దాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లి, 10 శాతానికి పెంచుతామని ఈపీఎస్ హామీ ఇచ్చారు. నీట్ పరీక్షలో పాసయ్యే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల డాక్టర్ కలను నిజం చేయడానికి ఈ అదనపు 2.5% రిజర్వేషన్ పెద్ద బూస్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
మహిళలకు నెలకు రూ.2000...
ప్రస్తుతం అమల్లో ఉన్న మహిళల ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేసి నెలకు రూ.2,000 అందిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అంతేకాదు పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కోసం ప్రతి కుటుంబానికీ ఒకేసారి రూ.10,000 'ఆరుదల్ తొగై' పేరట ఇస్తామన్న హామీ మధ్యతరగతి వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అన్నాడీఎంకే మరికొన్ని హామీలు..
- ఏడాదికి 3 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం.
- విద్యార్థులు బ్యాంకుల నుంచి తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లు పూర్తిగా మాఫీ.
- క్వింటాలు వరికి రూ.3,500 కనీస ధర వచ్చేలా చర్యలు
- టన్ను చెరకుకు రూ.4,500 కనీస ధర వచ్చేలా చర్యలు
- చేపల వేటకు వెళ్లి సముద్రంలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం.
పురుషులకు ఉచిత బస్సుపైనే చర్చ..
డీఎంకే ఎన్నికల హామీలకు పోటీగా, నటుడు విజయ్ రాజకీయ ప్రవేశంతో యువతలో వస్తున్న మార్పును ఎదుర్కోవడానికి అన్నాడీఎంకే మేనిఫెస్టోను చాలా పక్కాగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, గృహిణులను టార్గెట్ చేస్తూ ఇచ్చిన ఈ హామీలు... 2026 ఎన్నికల్లో గ్రామీణ, మధ్యతరగతి ఓటర్లను అన్నాడీఎంకే వైపు తిప్పుతాయా లేదా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా అన్నాడీఎంకే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ హామీ తెలుగు వారిని ఆకట్టుకుంటోంది... తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది.

