- Home
- Andhra Pradesh
- Free Bus: మహిళలతో పాటు వారికి కూడా ఉచిత బస్సు.. ఏపీలో బుధవారం నుంచి కొత్త పథకం
Free Bus: మహిళలతో పాటు వారికి కూడా ఉచిత బస్సు.. ఏపీలో బుధవారం నుంచి కొత్త పథకం
Free Bus: ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ పథకం పరిధిలోకి మరికొందరిని తీసుకొచ్చింది. దివ్యాంగ శక్తి పేరుతో బుధవారం నుంచి కొత్త పథకం అమల్లోకి రానుంది.

ఉగాది కానుకగా కొత్త పథకం ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది కానుకగా ‘దివ్యాంగ శక్తి’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో రేపు (బుధవారం) ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది దివ్యాంగులకు ప్రయాణ సౌలభ్యం కలగనుంది.
ఎవరికెవరికీ లబ్ధి?
ఈ పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఈ పథకం ద్వారా మొత్త 12.76 లక్షల మంది లబ్ధిపొందనున్నారు. వీరిలో 11.16 లక్షల మంది దివ్యాంగులు ఉండగా, 1.60 లక్షల మంది సహాయకులు ఉన్నారు. దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు 50% టికెట్ రాయితీ ఇస్తారు.
21 వర్గాలకు విస్తరణ
ఇప్పటి వరకు కేవలం కొన్ని వర్గాలకే ప్రయోజనం ఉండేది. ఇప్పుడు ఈ పథకాన్ని 21 వర్గాల దివ్యాంగులకు విస్తరించారు. ఈ జాబితాలో శారీరక వైకల్యాలు, మానసిక సమస్యలు, ఆటిజం, నాడీ సంబంధ వ్యాధులు, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి సమస్యలు ఇలాంటి అనేక విభాగాల వారు చేరడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరుతుంది.
అన్ని ప్రధాన బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఇప్పుడు రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో వర్తిస్తుంది. మొత్తం 7,000కుపైగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. డిజిటల్ పాస్లను మొబైల్ యాప్స్ లేదా బస్టాండ్ కౌంటర్ల ద్వారా పొందవచ్చు. QR కోడ్ ఆధారంగా సులభంగా వినియోగించుకోవచ్చు.
ప్రభుత్వం ఎంత ఖర్చు చేయనుందంటే.?
ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.207 కోట్లు ఖర్చు చేయనుంది. దివ్యాంగులకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళల కోసం అమలు చేసిన ‘స్త్రీ శక్తి’ పథకం విజయవంతమైంది. అదే విధంగా ఈ పథకం కూడా మంచి ఆదరణ పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

