దేశ చరిత్రలో సంచలనం.. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన కోర్టు. అసలేం జరిగిందంటే?
Custodial Death Case: మదురై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కేసు ఏంటి.? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

9 మంది పోలీసులకు మరణ శిక్ష
దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించిన సాత్తాన్కుళం లాకప్ డెత్ కేసులో మదురై ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తండ్రి జయరాజ్, కుమారుడు బెన్నిక్స్ మరణానికి కారణమయ్యారని తేలిన తొమ్మిది మంది పోలీసు సిబ్బందికి కోర్టు మరణశిక్ష విధించింది. ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులే అమానుషంగా ప్రవర్తించారని న్యాయస్థానం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కస్టడీ హింసపై మరోసారి చర్చకు దారితీసింది.
కరోనా లాక్డౌన్ సమయంలో జరిగిన ఘటన
2020లో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మొబైల్ ఫోన్ షాప్ నడిపే పి. జయరాజ్, ఆయన కుమారుడు జే. బెన్నిక్స్పై నిర్ణయించిన సమయానికి మించి దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలు వచ్చాయి. జూన్ 19, 2020న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సాధారణ కేసుగా ప్రారంభమైన ఈ ఘటన తరువాత దేశాన్ని కుదిపేసే విషాదంగా మారింది.
పోలీస్ కస్టడీలో అమానుష హింస
అరెస్ట్ చేసిన తరువాత వారిద్దరిని స్టేషన్లో గంటల తరబడి విచారించినట్లు చెబుతూ పోలీసులు తీవ్రంగా హింసించారని దర్యాప్తులో తేలింది. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత వారిని కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. అయితే అప్పటికే గాయాల వల్ల పరిస్థితి విషమించడంతో జూన్ 22న బెన్నిక్స్, మరుసటి రోజు జూన్ 23న జయరాజ్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు
ఈ కేసు ప్రారంభంలో స్థానిక పోలీసులు విచారణ చేపట్టినా, భారీ ప్రజా నిరసనలు, హైకోర్టు జోక్యంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. సీబీఐ దర్యాప్తులో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. బాధితులపై థర్డ్ డిగ్రీ పద్ధతులు ప్రయోగించినట్లు ఆధారాలు లభించాయి. స్టేషన్లో జరిగిన హింసకు సంబంధించిన సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరిగినట్లు తేలింది. రికార్డులను మార్చి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేసినట్లు గుర్తించారు. ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కూడా కేసులో కీలకంగా మారింది. ఆమె తెలిపిన వివరాలు పోలీస్ స్టేషన్లో జరిగిన హింసను నిర్ధారించాయి.
మదురై కోర్టు సంచలన తీర్పు
ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం మదురై ప్రత్యేక కోర్టు సోమవారం కీలక తీర్పు ప్రకటించింది. తండ్రీకొడుకుల మరణానికి బాధ్యులుగా గుర్తించిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు కోర్టు మరణశిక్ష విధించింది. శిక్షపడిన వారిలో శ్రీధర్, రఘుగణేశ్, మురుగన్, బాలకృష్ణన్, ముత్తురాజ్, చెల్లాదురై, థోమన్ ఫ్రాన్సిస్, సముదురై, వేయిల్ముత్తు ఉన్నారు. వీరిలో శ్రీధర్కు రూ.15 లక్షల జరిమానా కూడా విధించారు. పోలీసులు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నప్పటికీ అదే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమానుష చర్యలకు పాల్పడ్డారని కోర్టు పేర్కొంది.
పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరిక
ఈ తీర్పు కేవలం ఒక కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. కస్టడీ హింసపై పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా దీనిని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. పోలీసుల చేతుల్లో జరిగే హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టం చేస్తోందని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

