Raghav Chadha: పదవి పోయింది.. నోరు మూయించారు.. రాఘవ్ చద్దా ఏం చేశారు? ఆప్ కక్షగట్టిందా?
Raghav Chadha : రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుండి రాఘవ్ చద్దాను తొలగిస్తూ కేజ్రీవాల్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించాలని రాజ్యసభ సెక్రటేరియట్కు లేఖ రాసింది.

రాజ్యసభలో రాఘవ్ చద్దా నోరు నొక్కేసిన ఆమ్ ఆద్మీ పార్టీ? కారణం ఏంటి?
గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో రాఘవ్ చద్దా హాట్ టాపిక్ గా మారారు. అనేక సమస్యలను ఎత్తిచూపుతూ ప్రపకంనలు రేపారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీలో కీలక నేతగా, అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాపై పార్టీ హైకమాండ్ వేటు వేసింది.
రాజ్యసభలో పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్కు ఆప్ అధికారికంగా లేఖ రాసింది. రాఘవ్ చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను డెప్యూటీ లీడర్గా నియమించాలని పార్టీ కోరింది. అయితే కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, రాజ్యసభలో పార్టీకి కేటాయించిన సమయంలో చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కూడా సెక్రటేరియట్ను ఆప్ కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అశోక్ మిట్టల్కు కొత్త బాధ్యతలు
చద్దా స్థానంలో నియమితులైన అశోక్ మిట్టల్ పంజాబ్కు చెందిన ఎంపీ. ఆయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఛాన్సలర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకంపై స్పందించిన మిట్టల్, తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు అరవింద్ కేజ్రీవాల్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైనదని, అందరికీ అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఆప్కు 10 మంది సభ్యులు ఉండగా, సంజయ్ సింగ్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు.
రాఘవ్ చద్దా రాజకీయ ప్రస్థానం ఇదే
37 ఏళ్ల రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుండి కీలక పాత్ర పోషించారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆయన, 2012లో ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయంలో కేజ్రీవాల్తో కలిశారు. ఢిల్లీ లోక్పాల్ బిల్లు రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ జాతీయ ప్రతినిధిగా, కోశాధికారిగా, ఢిల్లీ జలమండలి వైస్ ఛైర్మన్గా పనిచేశారు. 2022లో 33 ఏళ్ల వయసులోనే అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. గతేడాది సంజయ్ సింగ్ స్థానంలో ఆయనను తాత్కాలికంగా పార్టీ లీడర్గా కూడా నియమించారు.
రాఘవ్ చద్దా తొలగింపు వెనుక బలమైన కారణాలు?
రాఘవ్ చద్దాను తొలగించడానికి ఆప్ అధికారికంగా ఎటువంటి కారణాలు తెలపలేదు. కానీ, గత కొన్ని నెలలుగా పార్టీ వ్యవహారాల్లో ఆయన మౌనంగా ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కోర్టు నుంచి ఊరట లభించినప్పుడు ఆయన స్పందించకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది.
అలాగే, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు, కీలక మీడియా సమావేశాలకు ఆయన హాజరుకాకపోవడం గమనార్హం. పార్టీ నిర్ణయించిన రాజకీయ లైన్ కంటే భిన్నంగా చద్దా ఇతర అంశాలపై (మెన్స్ట్రువల్ హైజీన్, గిగ్ వర్కర్ల హక్కులు) ఎక్కువ దృష్టి పెట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది.
పార్లమెంట్లో గొంతు నొక్కే ప్రయత్నమా?
రాజ్యసభలో ఒక పార్టీకి లభించే సమయాన్ని ఆ పార్టీయే తన ఎంపీలకు పంచుతుంది. రాఘవ్ చద్దాకు ఆప్ కోటాలో మాట్లాడే సమయం కేటాయించవద్దని కోరడం అంటే, సభలో ఆయన గొంతును పార్టీయే అదుపు చేసినట్లవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, సర్పంచ్ పతి వ్యవస్థ వంటి ప్రజా సమస్యలపై గతంలో చద్దా గళమెత్తారు. ఇప్పుడు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో సభలో ఆయన ప్రసంగాలకు అడ్డుకట్ట పడినట్లయింది.
ఆప్లో మారుతున్న సమీకరణాలు
రాజ్యసభలో 10 మంది సభ్యులతో (పంజాబ్ నుంచి 7, ఢిల్లీ నుంచి 3) ఆప్ నాల్గవ అతిపెద్ద పార్టీగా ఉంది. రాఘవ్ చద్దా వంటి యువ నేతను పక్కన పెట్టడం వెనుక అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చద్దా పార్టీ మారుతున్నారనే ప్రచారం కూడా సాగుతున్నప్పటికీ, సంజయ్ సింగ్ వంటి నేతలు ఆ వార్తలను ఖండించారు. అయితే, ఈ తాజా పరిణామాలు ఆప్లో రాఘవ్ చద్దా భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తున్నాయి. మరి రాఘవ్ చద్దా దీనిపై ఏం మాట్లాడుతారో చూడాలి.

