నీళ్లను తాగడానికి భయపడితే.. మీ ఆయుష్షు తగ్గడం ఖాయం..!
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. శరీరంలోని ద్రవాల స్థాయి బాగా పడిపోయినప్పుడు సీరం సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఇది ఎన్నో దీర్థకాలిక రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు మీరు అర్థాంతరంగా చనిపోయేలా చేస్తుంది.
మన శరీరానికి నీరెంత ముఖ్యమో అందరికీ తెలిసే ఉంటుంది. నిజానికి నీరు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో నీరు తగ్గితే ముందస్తు వృద్ధాప్యం నుంచి ఎన్నో చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాడీ డీహైడ్రేషన్ బారిన పడితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. డీహైడ్రేషన్ వేగంగా వృద్ధాప్యం,జీవితాన్ని చాలా త్వరగా ముగించేస్తుందని ఒక కొత్త పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు సరిగ్గా హైడ్రేటెడ్ గా ఉన్న వృద్ధులు లేని వారి కంటే మరింత ఎక్కువ కాలం జీవిస్తారట. అంతేకాదు వీళ్లు గుండె, ఊపిరితిత్తుల వ్యాధి వంటి తక్కువ ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారని తేలింది.
నీరు జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి, శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి, కొవ్వును కరిగించడానికి, నిర్జలీకరణాన్ని నివారించడానికి చాలా చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెద్దవారు రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. శరీరానికి తగినంత నీటిని తాగకపోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది చర్మాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ.. చాలా మంది నీటిని తాగడానికి అస్సలు ఇష్టపడరు.
ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మన శరీరంలో ద్రవాల స్థాయిలు పడిపోయినప్పుడు సీరం సోడియం స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులకు, అకాల మరణానికి దారితీస్తుంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఈ ఫలితాలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం ఈ బయోమెడిసిన్ లో ప్రచురించబడింది.
అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల ప్రకారం.. అధిక సీరం సోడియం స్థాయిలు ఉన్నవారికి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అలాగే తక్కువ సోడియం స్థాయిలు ఉన్నవారితో పోలిస్తే కణాలు వృద్ధాప్యంతో పాటుగా అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదం పొంచి ఉంది.
11,000 మందికి పైగా.. 30 సంవత్సరాల కంటె ఎక్కువ ఆరోగ్య డేటాను పరిశోధన కోసం ఉపయోగించారు. సాధారణ సీరం సోడియం స్థాయి లీటరుకు 135 -146 మిల్లీవాలెంట్స్. సీరం సోడియం స్థాయిలు 142 కంటే ఎక్కువ ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్, రక్తనాళాల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని కనుగొనబడింది. సీరం సోడియం స్థాయిలను ప్రభావితం చేసే ఇతర అంశాలు వయస్సు, లింగం, ధూమపానం, అధిక రక్తపోటు అని పరిశోధకులు తెలిపారు.
యుఎస్ సిడిసి ప్రకారం.. ఎవరు ఎంత నీరు తాగాలనే దానిపై ఎలాంటి సిఫార్సులు లేవు. సాధారణంగా రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది కప్పుల నీటిని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తారు. నేషనల్ అకాడమీస్ ఫర్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, యుఎస్.. పురుషులు రోజుకు 15.5 కప్పులు (3.7 లీటర్లు), మహిళలు రోజుకు 11.5 కప్పులు (2.7 లీటర్లు) ద్రవం తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.