Lord Vishnu: గద్ద మహావిష్ణువు వాహనంగా ఎలా మారింది? గరుత్మంతుడి కథ ఏమిటి?
Lord Vishnu: మహా విష్ణువు వాహనం గరుత్మంతుడు. అంటే గద్ద. ఎన్నో పక్షులు, జీవులు ఉండగా గద్దకు విష్ణువు వాహనంగా మారే అవకాశం ఎలా దక్కింది? దీని వెనుక పెద్ద పోరాట గాధే ఉంది. ఆ కథేంటో తెలుసుకోండి.

గరుత్మంతుడి తల్లిదండ్రులు
గరుత్మంతుడు మహావిష్ణువు వాహనంగా పేరు పొందాడు. మహా విష్ణువుతో పాటు గరుత్మంతుడిని కూడా పూజిస్తారు. ఎన్నో పశు పక్ష్యాదులు, జీవులు ఉండగా మహావిష్ణువుకు గరుత్మంతుడే ఎలా వాహనంగా మారాడు? దీని వెనకాల ఎంతో కథ ఉంది. గరుత్మంతుడు అంటే గద్ద. ఋషి కశ్యుపుడు, వినుత అనే స్త్రీకి జన్మించిన కొడుకు గరుడుడు. కశ్యప మహర్షి మరొక భార్య కద్రు కూడా ఉంది. ఓరోజు కద్రూ, వినుతకి మధ్య వాదన వచ్చింది. ఆ వాదనలో కద్రు గెలిచింది. దాంతో వినుత కద్రుకి దాసిగా మారాల్సి వచ్చింది.
తల్లి బానిసత్వం చూసి
తల్లి వేరొక మహిళ దగ్గర బానిసగా ఉండడం చూసి గరుడుడు తట్టుకోలేకపోయాడు. కద్రూకు వేయి మంది నాగులు కొడుకులుగా పుట్టారు. ఆ నాగులు గరుడుడితో దేవతల వద్దన్న అమృతాన్ని తీసుకొస్తే నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెడతామని చెబుతారు. దాంతో తల్లి విముక్తి కోసం గరుడుడు అమృతం తేవడానికి దేవలోకానికి బయలుదేరుతాడు. ఆ పని చేయడం చాలా కష్టమని తెలిసినా తల్లి స్వేచ్ఛ కోసం తన ప్రాణాలనే పణంగా పెడతాడు.
దేవతలతోనే యుద్ధం
గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ స్వర్గలోకానికి వెళుతూ ఉంటాడు. దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని తన శక్తితో, ధైర్యంతో అధిగమిస్తాడు. ఎలాగైనా తల్లిని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఎన్నో పోరాటాలు చేస్తాడు. చివరికి స్వర్గలోకానికి చేరుతాడు. అక్కడ దేవతలతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. తల్లి కోసం దేవతలతో కూడా యుద్ధం చేసి చివరికి అమృతాన్ని సంపాదిస్తాడు.
మెచ్చిన మహావిష్ణువు
అమృతం తీసుకుని తిరిగి తల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహా విష్ణువు ఆ గరుడుడి ధైర్యం, శక్తి చూసి ఎంతో సంతోషిస్తాడు. గరుత్మంతుడిని ఆపి ఏమైనా వరాలు కావాలా? అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు విష్ణువుకు భక్తితో నమస్కరించి నేను మీకు వాహనంగా మారతాను అని చెబుతాడు. వెంటనే విష్ణువు ఆ కోరికను అంగీకరిస్తాడు. అప్పటినుంచి గరుడుడినే తన వాహరంగా స్వీకరిస్తాడు. విష్ణువు ఎక్కడికి వెళ్లినా వెంట గరుత్మంతుడు ఉండాల్సిందే. ఇక గరుడుడు అమృతాన్ని తీసుకెళ్లి తన సవతి సోదరులైన నాగులకు ఇస్తాడు. కానీ వారు దాన్ని తాగేలాపే ఇంద్రుడు వచ్చి తిరిగి లాక్కొని వెళ్ళిపోతాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అమృతం తెచ్చాడు కాబట్టి గరుత్మంతుడి తల్లిని విడిచి పెట్టేస్తారు నాగులు.

