Guava Seeds: జామకాయ గింజలను తింటే నిజంగానే కడుపునొప్పి వస్తుందా? ఎవరు తినకూడదు?
Guava Seeds: జామకాయ పేదవాడి పండు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ జామకాయలోని గింజలను తింటే కడుపునొప్పి వస్తుందని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

జామ ఎందుకు తినాలి?
జామకాయ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే జామకాయను తొక్కతో పాటు తినాలని చెబుతారు. అలాగే గింజలను కూడా తినాలని చెబుతారు వైద్య నిపుణులు. అయితే జామకాయ గింజలు తింటే కడుపునొప్పి వస్తుంది అనే మాట ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు గింజలు మింగితే జీర్ణం కావని పొట్టనొప్పి వచ్చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
గింజలతో నష్టమేమీ లేదు
జామకాయ గింజలు గట్టిగానే ఉంటాయి. అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది అనేది నిజమే. అయితే జామకాయలు తినడం వల్లే కడుపునొప్పి వస్తుంది అనేది పూర్తిగా అపోహ. జామకాయ గింజలను మరీ అతిగా తింటే జీర్ణ క్రియపై కాస్త ఒత్తిడి పడుతుంది. వాటిని వీలైనంతవరకూ నమిలి మింగితే ఎలాంటి సమస్య ఉండదు. కొందరికి విపరీతమైన అజీర్ణం సమస్యలు, కడుపుబ్బరం సమస్యలు ఉంటాయి. అలాంటివారు ఈ జామకాయ గింజలను తినడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అంతే తప్ప జామకాయ గింజలను తినడం వల్ల అజీర్ణ సమస్యలు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటివి రావు. జామకాయ తినేటప్పుడు గింజలను కూడా బాగా నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
వీరు తినకూడదు
జామకాయ గింజలు చాలా తక్కువ మందిలో మాత్రమే సమస్యలకు కారణం అవుతాయి. అలాంటివారికి మలబద్ధకం లేదా పేగుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు జామకాయ ఇచ్చేటప్పుడు కోసి గింజలు తక్కువగా ఉండేలా చూసి ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికే పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు మాత్రం గింజలు లేకుండా జామకాయను తింటే త్వరగా జీర్ణం అవుతుంది.
రెండు కన్నా వద్దు
ఇక మొత్తంగా చెప్పాలంటే జామకాయ గింజలు కడుపునొప్పికి పూర్తిగా కారణం కాదు. బాగా నమిలి తింటే ఎలాంటి సమస్యలు రావు. పైగా జామకాయ గింజల్లో కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏ ఆహారాన్నయినా మితిమీరి తింటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రోజుకు రెండు జామకాయలకు మించి తినకపోవడమే మంచిది. తగినంత నీరు తాగడం, వ్యాయామం చేయడం వంటివి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేస్తాయి.

