First Periods: మనదేశంలోని ఆడపిల్లల్లో 8 ఏళ్లకే పీరియడ్స్ ఎందుకు మొదలవుతున్నాయో తెలుసా?
First Periods: అమ్మాయిల జీవితంలో మొదటి రుతుస్రావం ఎంతో ముఖ్యమైనది. ఈ దశలో ఎన్నో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు జరుగుతాయి. అయితే మనదేశంలో చిన్న వయసులోనే ఆడపిల్లలకు నెలసరి మొదలవుతోంది.దీనికి కారణాలు ఏమిటో తెలుసా?

ఎనిమిదేళ్లకే రుతుస్రావం
నెలసరి లేదా రుతుస్రావం అనేది అమ్మాయిల్లో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. అయితే ఒక అమ్మాయి జీవితంలో మొదటిసారి రుతుస్రావడం కావడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది ఆ అమ్మాయికి కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. మొదటిసారి పీరియడ్స్ ప్రారంభం అవ్వడాన్ని మెనార్చే అని అంటారు. రుతుస్రావం ప్రారంభం కావడం ఆ అమ్మాయి జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం. ఈ కాలంలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. ఎన్నో భావోద్వేగాలు కూడా కలుగుతాయి. సాధారణంగా అమ్మాయిలకు మొదటి పీరియడ్స్ 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు మనదేశంలో ఎనిమిదేళ్లకే పీరియడ్స్ ప్రారంభమవుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది.
కారణాలు ఇవే
చిన్న వయసులోనే రుతుస్రావం ఎందుకు మొదలవుతోంది? ఈ రోజుల్లో అమ్మాయిలకు ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అధికంగా తినడం, శారీరక శ్రమ చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్ర తగ్గిపోవడం, తీవ్రమైన చదువుల ఒత్తిడి ఇవన్నీ కూడా వారిలో అనేక మార్పులకు కారణం అవుతున్నాయి. దీనివల్ల వారు త్వరగా రజస్వల అవుతున్నారు.
స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్
ఈ కాలంలోని పిల్లలు చదువు విషయంలో అధికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే వారు టీవీ, ఫోన్ చూసే సమయం కూడా పెరిగిపోతుంది. దీనివల్ల నిద్ర విధానాల్లో మార్పులు వస్తున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలి వారికి చిన్నప్పటి నుంచే అలవాటవుతోంది. మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువవుతున్నాయి. వీటిని తిన్న అమ్మాయిల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు త్వరగా ప్రారంభమై.. రుతుస్రావం కూడా త్వరగానే మొదలవుతోంది. దీనితో ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య గల ఆడపిల్లలు త్వరగా రజస్వల అవుతున్నారు.
ఎప్పుడు సమస్య?
ఎనిమిదేళ్లు దాటిన ఆడపిల్లలకు తల్లి రుతుస్రావం గురించి ఎంతో కొంత సమాచారాన్ని చెప్పడం చాలా ముఖ్యం. లేకుంటే వారు ఒక్కసారిగా భయపడే అవకాశం ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల వయసు రాకముందే ఋతుస్రావం మొదలైతే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక అమ్మాయికి 15 ఏళ్లు దాటినా కూడా పీరియడ్స్ మొదలుకాకపోయినా కూడా డాక్టర్ ను కలిసి తగిన చికిత్సలు తీసుకోవాలి. రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి కూడా ప్రమాదకరమైనది. ఇది పీసీఓడీ లేదా ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు సంకేతంగా భావించాలి.

