Chillies: కారం కారంగా తినే మిరపకాయ మనది కాదా? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది..!
Chillies: రోటి పచ్చళ్ల దగ్గర నుంచి బిర్యానీ వరకు మనకు ప్రతి వంటకు మిరపకాయ ఉండాల్సిందే. మన వంటలో పూర్తి భాగమైపోయిన మిరప మనది కాదా? మరి, మన దేశంలోకి ఎలా వచ్చింది..?

మిరప మనది కాదా?
ఇండియన్ ఫుడ్ అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది కారమే. కూరలు, పప్పులు, చట్నీలు, పచ్చళ్లు.. ఇలా ప్రతి వంటలోనూ మనకు మిరపకాయ పడాల్సిందే. అంతెందుకు.. మన దేశంలో చాలా మంది రైతులు కేవలం పచ్చి మిర్చీ పండిస్తూ.. తమ జీవనాన్ని సాగిస్తున్నారు. భారతీయ వంటకాలకు గుర్తింపుగా మారిన ఈ మిరపకాయలు అసలు మన దేశ పంట కానే కాదు అనే విషయం మీకు తెలుసా? విదేశాల నుంచి మన దేశంలోకి అడుగుపెట్టిన.. ఈ పంట.. ఇప్పుడు మన వంటల్లో భాగం అయిపోయింది. మరి.. మన దేశానికి ఎలా వచ్చింది? మిరపకాయ రాకముందు కారం కోసం ఏది వాడేవారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...
మిరపకాయ పుట్టింది ఇక్కడే..
మనం ప్రతిరోజూ వాడే మిరప.. మొదట పుట్టింది మధ్య అమెరికాలో. ఆ తర్వాత.. అది పోర్చుగీస్ వ్యాపారుల వద్దకు చేరింది. అక్కడి నుంచి.. భారత్ లోకి అడుగుపెట్టింది. సుమారు 6,500 సంవత్సరాల క్రితమే మెక్సికోలో మిరపసాగు చేసేవారు. క్రమంగా..అది ప్రపంచం మొత్తానికి వ్యాపించింది.
మిరపకు ముందు కారం కోసం ఏం వాడేవారు..?
మిరపకాయలు మన దేశానికి రాకముందు, భారతీయులు కారం కోసం మిరియాలు, పిప్పలి లాంటి మసాలా దినుసులను ఉపయోగించేవారు. ఇప్పుడు మనకు తెలిసిన ఎర్ర మిరపకాయ.. పూర్వం అసలు వాడే వారు కాదు.
మిరప మన దేశంలోకి ఎలా అడుగుపెట్టింది..?
1492లో క్రిస్టోపర్ కొలంబస్ ఆసియాకు సముద్ర మార్గం వెతుకుతూ కరేబియన్ ప్రాంతానికి చేరుకున్నప్పుడు మిరపకాయను మొదటిసారి చూశాడు. అతను నల్ల మిరియాల కోసం వెతుకుతుండటంతో.. ఈ కొత్త పంటను కూడా మిరియాల జాతిగానే ఆయన భావించాడు. అయితే.. మిరపకాయను మాత్రం కొలంబస్ నేరుగా భారత దేశానికి తీసుకురాలేదు. చరిత్ర ప్రకారం.. 16వ శాతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారులు బ్రెజిల్ నుంచి మిరపకాయ విత్తనాలను తీసుకువచ్చి.. భారతదేశంలో ప్రవేశపెట్టారు. మొదట గోవాలో ఈ మిరపను తీసుకువచ్చారు. అయితే.. గోవాలో మొదట్లో మిరపకాయను పెర్నాంబుకో పెప్పర్ అని పిలచేవారు.
భారతీయ వంటల్లో మిరప ఎలా భాగం అయ్యింది..?
పోర్చుగీసు వారు మన దేశానికి మిరపను తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే అది మన ప్రజల ఆహారంలో భాగమైంది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మిరియాలతో పోలిస్తే.. మిరప తక్కువ ఖర్చుకే లభించింది. అంతేకాదు.. భారత్ లో చాలా సులభంగా పండింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పెట్టుబడి వస్తుంది. వంటకు మంచి ఘాటైన రుచిని కూడా తీసుకువస్తుంది. అందుకే.. చాలా తక్కువ సమయంలోనే భారత వంటల్లో కారం ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో పండే మిరప ప్రసిద్ధిగా మారింది.
భారత్ లో పండే మిరప రకాలు...
గుంటూరు మిరపకాయ – ఘాటైన కారానికి ప్రసిద్ధి. బ్యాడ్గి (Byadgi) మిరపకాయ – కారం తక్కువగా ఉండి, గాఢమైన ఎరుపు రంగుకు పేరుగాంచింది. కాశ్మీరీ మిర్చి – వంటకాలకు ఆకర్షణీయమైన ఎరుపు రంగును ఇస్తుంది. భూత్ జలోకియా – ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరపకాయల్లో ఒకటి.
ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చిన ఈ పంట, ఇప్పుడు భారత వ్యవసాయంలో కీలక భాగంగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మిరపకాయల ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో భారతదేశం ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు పెద్ద ఎత్తున మిరపకాయలను పండిస్తున్నాయి.

