Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Cashew: జీడిపప్పు పేరు చెబితేనే అది ధనవంతుల ఆహారంగా భావిస్తారు ఎంతో మంది. నిజానికి చాలా తక్కువ ధరకే జీడిపప్పును అమ్మే గ్రామం ఒకటుంది. మీ చేతిలో వంద రూపాయలు ఉన్నా చాలు ఒక సంచి నిండా జీడిపప్పులు కొని తెచ్చుకోవచ్చు. ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకోండి.

జీడిపప్పుల విలేజ్
జీడిపప్పులు గుర్తొస్తేనే చాలామందికి నోరూరిపోతుంది. వాటిని వేయించి తిన్నారంటే చాలా రుచిగా ఉంటాయి. అయితే వీటి ఖరీదు మాత్రం ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపప్పు 800 రూపాయల నుంచి 1000 రూపాయలు వరకు ఖర్చవుతుంది. అయితే మీరు కేవలం కిలో 30 రూపాయల నుంచి 100 రూపాయల మధ్య కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం మీరు జార్ఖండ్ లోని ఒక గ్రామానికి వెళ్లాలి. ఆ గ్రామం పేరు నాలా. జార్ఖండ్లోని జామ్తారా అనే జిల్లా ఉంటుంది. అక్కడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ నాలా అనే గ్రామం ఉంటుంది. దీన్ని జార్ఖండ్ జీడిపప్పు సిటీగా పిలుచుకుంటారు.
జీడిపప్పులు ఎక్కడ అమ్మాలో తెలియక..
నాలా గ్రామంలో కూరగాయలతో పాటు జీడిపప్పులను కూడా రోడ్డు మీద పెట్టి అమ్మేస్తూ ఉంటారు. నిజానికి జీడిపప్పులను అక్కడ కూరగాయల కన్నా తక్కువ ఖరీదుకే అమ్ముతారు. జీడిపప్పులు ఇంత చవకగా దొరకడానికి కారణం ఆ గ్రామంలో అందరూ వీటినే పండిస్తారు. దాదాపు 50 ఎకరాల్లో జీడిపప్పు అక్కడ సాగు అవుతుంది. వాటిని దూర తీర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మలేక తమ దగ్గరకు వచ్చే వారికే చాలా తక్కువ ధరకు అమ్మేస్తూ ఉంటారు. చాలా మంది వీరి దగ్గర చవకగా కొని వారు పది రెట్లు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు.
ఎందుకంత చవక?
2010కి ముందు ఈ గ్రామస్తులు ఏ పంటలు పండించాలో తెలియక ఇబ్బంది పడేవారు. కానీ అక్కడి వాతావరణం, నేల జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే రైతులకు జీడిపప్పు తోటల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. అప్పటినుంచి వాటిని పెద్ద ఎత్తున సాగు చేయడం మొదలుపెట్టారు. మొక్కలకు జీడిపప్పు కాయలు కాసిన వెంటనే రైతులు వాటిని కోసి అసలు ధరలో నాలుగోవంతుకే రోడ్డు పక్కన పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందకపోవడంతో గ్రామస్తులు ఇలా జీడిపప్పులు చవకగా అమ్ముకోవాల్సి వస్తోంది.
ఎగుమతులు చేస్తేనే లాభం
2010లో ఐఏఎస్ కృపానంద్ జాంతార జిల్లా డిప్యూటీ కమిషనర్ గా ఉండేవారు. అతనే నాలా గ్రామంలోని నేల, వాతావరణ పరిస్థితులు జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉంటాయని తెలుసుకున్నారు. ఇక వ్యవసాయ శాస్త్రవేత్తల సంప్రదించి జీడిపప్పులు సాగు చేసేలా చొరవ తీసుకున్నారు. కానీ రైతులకు దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు ఇప్పటికి జీడిపప్పును చాలా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. అక్కడ జీడిపప్పు ప్రాసెసింగ్ ప్లాంట్ లేకపోవడం వల్ల ఇలా రైతులు తక్కువ ధరకే అమ్ముతున్నారు. అదే ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటే వారు ఇక్కడి నుంచి ఎగుమతులు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. కాని దానిపై ఎవరు దృష్టి పెట్టడం లేదు. దీంతో కూరగాయలతో పాటూ జీడిపప్పులను కూడా రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు రైతులు.

