ఉద్యోగులకు శ్రీరామనవమి కానుక.. 8వ వేతన సంఘం ముందే శాలరీలు భారీగా పెరిగాయోచ్
8th Pay Commission : భారతీయ రైల్వే ఉద్యోగులకు 8వ వేతన సంఘం కంటే ముందే శాలరీలు పెరగనున్నాయి. వారికి లభించే వివిధ అలవెన్సులను పెంచుతూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 2024 నుండే ఈ అలవెన్సులు అందనున్నాయి.

రైల్వే ఉద్యోగుల శాలరీ పెంపు
Indian Railway : ఈ శ్రీరామనవమి పర్వదినానికి ముందే భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ, రైల్వే రన్నింగ్ స్టాఫ్ కోసం 'కిలోమీట్రేజ్ అలవెన్స్' (Kilometrage Allowance), 'అలవెన్స్ ఇన్ లీ ఆఫ్ కిలోమీట్రేజ్' (ALK) రేట్లను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం (8th CPC) అమలు కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ అలవెన్సుల పెంపు వారికి పెద్ద ఊరటనిస్తోంది.
జనవరి 2024 నుండే అమలు...
తాజా సవరణ ప్రకారం పెరిగిన ఈ అలవెన్సులు జనవరి 1, 2024 నుండి వర్తిస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (AIRF), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) వంటి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్లకు స్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్త సంప్రదింపుల తర్వాత ఈ పెంపునకు ఆమోదం లభించింది.
డీఏ 50 శాతానికి చేరడంతో మార్పు..
నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం (DA) 50 శాతానికి చేరుకున్నప్పుడు కొన్ని రకాల అలవెన్సులను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. జనవరి 1, 2024 నాటికి డీఏ 50 శాతం మార్కును దాటడంతో, 2016 రివైజ్డ్ పే రూల్స్ ప్రకారం రన్నింగ్ స్టాఫ్ అలవెన్సులను ప్రభుత్వం అప్డేట్ చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది లోకో పైలట్లు, గార్డులు, ఇతర రన్నింగ్ స్టాఫ్ ఆర్థికంగా లబ్ధి పొందనున్నారు.
రైల్వే ఉద్యోగులకు మాత్రమే..
ఈ సవరణ కేవలం అలవెన్స్ రేట్లకు మాత్రమే వర్తిస్తుందని, వీటికి సంబంధించిన అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనలలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. రైల్వే కార్యకలాపాలకు వెన్నెముకగా నిలిచే రన్నింగ్ స్టాఫ్ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని రైల్వే శాఖ ఈ సందర్భంగా పేర్కొంది.

