- Home
- Jobs
- Government Jobs
- 8th Pay Commission : ఉద్యోగుల జీతాలు 400% పెంపు? నెలకు రూ.2.5 లక్షల జీతం కాస్తా రూ.11 లక్షలా..!
8th Pay Commission : ఉద్యోగుల జీతాలు 400% పెంపు? నెలకు రూ.2.5 లక్షల జీతం కాస్తా రూ.11 లక్షలా..!
8వ వేతన సంఘం ముందు ఉద్యోగ సంఘాలు 5 అంచెల కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములాను ప్రతిపాదించాయి. దీనికి పే కమీషన్ అంగీకరిస్తే ఉద్యోగుల జీతాలు 400% వరకు పెరిగే అవకాశం ఉంది.

ఉద్యోగుల జీతాాలు డబుల్..
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న 8వ వేతన సంఘం ప్రక్రియ ఇప్పుడు కేవలం సాధారణ జీతాల సవరణగా మిగిలిపోలేదు. దేశ చరిత్రలోనే అతిపెద్ద జీతాల విప్లవానికి ఇది నాంది పలికేలా కనిపిస్తోంది. కొంతమంది సీనియర్ అధికారుల జీతాలను ఏకంగా 400 శాతానికి పైగా పెంచగల ఒక కొత్త ఫార్ములా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ (IRTSA) సహా వివిధ ఉద్యోగ సంఘాలు కమిషన్ ముందు ఉంచిన డిమాండ్లు, ఈ జీతాల లెక్కల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఏమిటీ ఐదు అంచెల 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' ప్రతిపాదన?
గత వేతన సంఘాల్లో దేశంలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు ఒకే రకమైన 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' ఉపయోగించేవారు. కానీ ఈసారి IRTSA, ఉద్యోగుల పే లెవెల్స్కు అనుగుణంగా 5 వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను వర్తింపజేయాలని ప్రతిపాదించింది.
ప్రతిపాదించిన 5 దశల వివరాలు ఇవి
లెవెల్ 1 నుంచి 5 వరకు ఉద్యోగులకు: 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
లెవెల్ 6 నుంచి 8 వరకు ఉద్యోగులకు: 3.50 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
లెవెల్ 9 నుంచి 12 వరకు ఉద్యోగులకు: 3.80 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
లెవెల్ 13 నుంచి 16 వరకు ఉద్యోగులకు: 4.09 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
లెవెల్ 17 నుంచి 18 వరకు ఉద్యోగులకు: 4.38 ఫిట్మెంట్ ఫ్యాక్టర్
ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో పెరుగుతాయంటే..
వేతన సంఘం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం (Basic Pay) ఊహించని విధంగా పెరగనుంది.
సీనియర్ అధికారులు (లెవెల్ 17-18) : ప్రస్తుతం రూ.2.5 లక్షల మూల వేతనం తీసుకుంటున్న ఒక సీనియర్ అధికారి జీతం, ప్రతిపాదిత 4.38 గుణకంతో నేరుగా సుమారు రూ.10.95 లక్షలకు పెరుగుతుంది.
మధ్య స్థాయి ఉద్యోగులు (లెవెల్ 6-8) : ప్రస్తుతం రూ.45,000 మూల వేతనం ఉన్న ఉద్యోగి జీతం ఈ ఫార్ములా ప్రకారం రూ.1.57 లక్షలకు పెరుగుతుంది.
ప్రస్తుత వ్యవస్థ జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య జీతాల వ్యత్యాసాన్ని అన్యాయంగా తగ్గించిందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే భద్రతా విభాగానికి చెందిన టెక్నికల్ సిబ్బందికి ప్రత్యేక వేతన శ్రేణి, వేగవంతమైన ప్రమోషన్లు, వార్షికంగా 5% జీతాల పెంపు, జీతాల సవరణకు ముందే 50% కరవు భత్యాన్ని (DA) మూల వేతనంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఏమిటీ 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్'? (The Fitment Factor Formula)
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి ఉపయోగించే ఒక సాధారణ గుణకాన్నే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. దీని అధికారిక ఫార్ములా ఇది:
కొత్త మూల వేతనం = ప్రస్తుత మూల వేతనం * ఫిట్మెంట్ ఫ్యాక్టర్
7వ వేతన సంఘంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా నిర్ణయించారు. కానీ ఈసారి వివిధ సంఘాలు కనీస వేతనాన్ని భారీగా పెంచాలని పట్టుబడుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) కనీస మూల వేతనాన్ని రూ.69,000కు పెంచాలని డిమాండ్ చేయగా, భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ (BPMS) కనీస జీతం రూ.72,000, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 4.0 ఉండాలని కోరుతోంది.
ప్రభుత్వం ముందున్న ఆర్థిక సవాళ్లు ఏంటి?
ఇంత పెద్ద మొత్తంలో జీతాల పెంపును భరించడం దేశ ఖజానాకు సాధ్యమేనా అనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ముందుంది. జీతాలు పెరిగితే కేవలం ప్రస్తుత ఉద్యోగులకే కాకుండా, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, ఇతర భత్యాలు (Allowances) కూడా పెరుగుతాయి. ఇది ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోపుతుంది.
కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జీతాలు సవరించాల్సి వస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం ద్రవ్యోల్బణం, మార్కెట్ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని మధ్యే మార్గాన్ని అనుసరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇతర ముఖ్యమైన డిమాండ్లు
కుటుంబం నిర్వచనంపై సవరణ (Family Unit) : గతంలో జీతం నిర్ణయించేటప్పుడు ఉద్యోగి కుటుంబాన్ని 3 యూనిట్లుగా (భర్త, భార్య, బిడ్డ) పరిగణించేవారు. కానీ ప్రస్తుత విద్య, ఆరోగ్య ఖర్చులు పెరిగినందున, తల్లిదండ్రులను కూడా చేర్చి 'ఫ్యామిలీ యూనిట్' సూత్రాన్ని 3 నుంచి 5కి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
పాత పెన్షన్ పథకం (OPS)పై చర్చ : జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉన్నందున, పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పూర్తిగా పాత విధానానికి వెళ్లడం కష్టమైనప్పటికీ, OPS తరహాలో గ్యారెంటీ పెన్షన్, డీఏ ఆధారిత పెన్షన్ రక్షణ కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
వేగవంతమైన సంప్రదింపుల ప్రక్రియ
రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం కమిటీ ఇప్పటికే ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో తీవ్రంగా చర్చిస్తోంది. తదుపరి దశలో జూలై 6, 7 తేదీల్లో భువనేశ్వర్లో పర్యటించనుంది. ఆ తర్వాత లక్నో, హైదరాబాద్, శ్రీనగర్, లడఖ్, జమ్మూ-కాశ్మీర్లో కూడా సమావేశాలు నిర్వహించనుంది.
కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఈ 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తుది నిర్ణయాలు దేశంలోని సుమారు 1.1 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.

