- Home
- International
- అమెరికాలో అమల్లోకి 50 శాతం టారిఫ్.. భారత్పై ప్రభావం ఏంటి? ట్రంప్ ఎందుకింతలా తెగించారు?
అమెరికాలో అమల్లోకి 50 శాతం టారిఫ్.. భారత్పై ప్రభావం ఏంటి? ట్రంప్ ఎందుకింతలా తెగించారు?
అమెరికా విధించిన అదనపు సుంకాలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో వాణిజ్య ఒత్తిడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమల్లోకి సుంకాలు
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి, భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి మరో 25 శాతం జోడించడంతో మొత్తం 50 శాతం భారమవుతోంది. ఈ మేరకు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ముసాయిదా ఉత్తర్వులు విడుదల చేసింది.
KNOW
ఎగుమతులపై ప్రభావం
భారత వాణిజ్యశాఖ అంచనాల ప్రకారం 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఈ సుంకాల ప్రభావానికి లోనవుతాయి. ముఖ్యంగా జౌళి వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలపై ప్రభావం తీవ్రంగా పడనుంది. అయితే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ సుంకాలు వర్తించవు.
కొన్నింటికీ మినహాయింపులు
సెప్టెంబర్ 17 ఉదయం 12.01 గంటల లోపు ఇప్పటికే రవాణాలో ఉన్న ఉత్పత్తులు లేదా గోదాముల నుంచి బయటకు వచ్చిన సరుకు సరఫరాలకు ఈ అదనపు సుంకాలు వర్తించవు. వీటికి ప్రత్యేక కోడ్ కేటాయిస్తారు. దీని ద్వారా కొన్ని ఎగుమతిదారులకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.
ట్రంప్ వ్యూహం ఏంటి.?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యల ద్వారా తమ దేశ గ్రామీణ ఓటర్ల మన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత రైతులు, పశుపోషకులు నష్టపోతారని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం పత్తి దిగుమతులపై విధించిన 11 శాతం సుంకాన్ని 40 రోజుల పాటు ఎత్తివేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా అమెరికన్ పత్తి దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది.
భారత ప్రభుత్వ వైఖరి ఏంటంటే.?
అమెరికా ఒత్తిడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన వైఖరి వ్యక్తం చేశారు. రైతులు, చిన్నతరహా పరిశ్రమలు, పశుపోషకుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడి పెరిగినా భారత్ దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేశారు.