- Home
- International
- పాకిస్థాన్ 'అణుబాంబులు' అమెరికా చేతికి.. ఆ దేశాధ్యక్షుడినే కొనేశాం : మాజీ సిఐఏ అధికారి సంచలనం
పాకిస్థాన్ 'అణుబాంబులు' అమెరికా చేతికి.. ఆ దేశాధ్యక్షుడినే కొనేశాం : మాజీ సిఐఏ అధికారి సంచలనం
పాకిస్థాన్ పూర్తిగా అమెరికాకు అమ్ముడుపోయిందని… ఆదేశ అణ్వాస్త్రాలపై నియంత్రణ అగ్రరాజ్యానిదేనని సిఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకో బైటపెట్టారు. యూఎస్-పాకిస్థాన్ స్నేహం గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

పాకిస్థాన్ తో అమెరికా స్నేహం అందుకేనా?
పాకిస్తాన్, అమెరికా మధ్య ఒక షాకింగ్ రహస్యం బయటపడింది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దేశ అణ్వాయుధాల నియంత్రణను నేరుగా యునైటెడ్ స్టేట్స్కు ఇచ్చారని మాజీ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అధికారి జాన్ కిరియాకో వెల్లడించారు. పాకిస్థాన్ కు అమెరికా ప్రభుత్వం లక్షల డాలర్ల సహాయం చేసిందని... ఇంకా చెప్పాలంటే ఇలా డబ్బులివ్వడం ముషారఫ్ ను కొనుగోలు చేయడానికి వేసిన ఎత్తుగడగా మాజీ సీఐఏ అధికారి పేర్కొన్నారు. ఈ విధంగా పాకిస్తాన్ చేతిలోని అత్యంత సున్నితమైన ఆయుధాలపై అమెరికా నియంత్రణ పొందిందని కిరియాకో అన్నారు.
యూఎస్, ముషారఫ్ మధ్య రహస్య ఒప్పందం?
ముషారఫ్ ఉగ్రవాద నిరోధక చర్యల్లో అమెరికా పక్షాన ఉన్నట్లు నటించారని కిరియాకో పేర్కొన్నారు. కానీ రహస్యంగా పాకిస్తాన్ సైన్యాన్న అదుపులో ఉంచుకుని తీవ్రవాదులకు భారత్ పై ఉసిగొల్పేవాడని... ఉగ్రవాదానికి పూర్తి స్వేచ్చ ఇచ్చాడన్నారు. "మేము సైనిక సహాయం లేదా ఆర్థిక అభివృద్ధి సహాయం రూపంలో మిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాం. మేము ముషారఫ్ తో వారానికి చాలాసార్లు క్రమం తప్పకుండా సమావేశమయ్యేవాళ్ళం. ఆయన మమ్మల్ని ఏది కావాలంటే అది చేయనిచ్చేవారు'' అని కిరియాకో వెల్లడించారు. ఇలా అమెరికా పాకిస్తాన్ భద్రత, వ్యూహాత్మక కార్యకలాపాలలో దాదాపు అడ్డంకులు లేకుండా ప్రవేశం పొందిందన్నారు.
#WATCH | On the question of fear of nuclear weapons falling into terrorists' hands in Pakistan, ex-CIA Officer, John Kiriakou says, "When I was stationed in Pakistan in 2002, I was told unofficially that the Pentagon controlled the Pakistani nuclear arsenal, and that Parvez… pic.twitter.com/iaKPpixhMZ
— ANI (@ANI) October 24, 2025
సౌదీ అరేబియా, ఏక్యూ ఖాన్: అణు ఒప్పందంలో పెద్ద ప్లాన్ ఉందా?
సౌదీ అరేబియా అమెరికా ప్రణాళికను ప్రభావితం చేసిందని కూడా మాజీ సీఐఏ అధికారి చెప్పారు. అమెరికా ఏజెన్సీలు పాకిస్తానీ శాస్త్రవేత్త అబ్దుల్ ఖదీర్ ఖాన్ను లక్ష్యంగా చేసుకోబోతుండగా అతన్ని వదిలేయమని సౌదీ తమను కోరిందన్నారు. దీని వెనుక సౌదీ అరేబియా స్వప్రయోజనాలు, సొంత అణు ఆకాంక్షలు ఉన్నాయన్నారు. ఇది ఒక పెద్ద విధానపరమైన తప్పిదమని.. దక్షిణాసియా అణు వ్యూహంపై ప్రభావం చూపిందని కిరియాకో అన్నారు.
మారుతున్న ప్రపంచం
అమెరికా ద్వంద్వ నీతిని విమర్శిస్తూ...వాషింగ్టన్ పాలకులకు నియంతలతో పనిచేయడం సౌకర్యంగా ఉంటుందన్నారు కిరియాకో. ప్రజాస్వామ్య ఆదర్శాలు, మానవ హక్కులను కేవలం మాట్లాడుకోడానికే పనికి వస్తాయని భావిస్తుందని అన్నారు. సౌదీ-అమెరికా సంబంధాలు లావాదేవీలపై ఆధారపడి ఉన్నాయని… ఇక్కడ చమురు, ఆయుధాల వ్యాపారానికే ప్రాధాన్యత ఉంటుందని కూడా మాజీ సీఐఏ అధికారి తెలిపారు.
ప్రపంచ శక్తి సమతుల్యత మారుతోందని ఆయన తేల్చిచెప్పారు. ఇప్పుడు సౌదీ అరేబియా, చైనా, భారత్ తమ వ్యూహాత్మక పాత్రను మార్చుకుంటున్నాయన్నారు. అందుకే అమెరికా కొత్త ఎత్తుగడలు వేయాల్సి వస్తోందన్నారు. ఈ పరిణామాలు దక్షిణాసియా రాజకీయాలు, అణు సమతుల్యతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని కిరియాకో పేర్కొన్నారు.
పాకిస్థాన్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమేనా?
అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించి జాన్ కిరియాకో చెబుతున్న మాటలనుబట్టి… అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించి చాలా ముందుగానే దక్షిణాసియా భద్రత, అణ్వాయుధాలపై నియంత్రణ సాధించిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పాకిస్తాన్ ఆయుధాలు ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉన్నాయా? అమెరికా వంటి దేశాల చేతిలో ఉన్నాయా? లేదా ఉగ్రకార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది.