సినీహీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తో హైడ్రా కూల్చివేతలు మొదలైన విషయం తెెలిసిందే. తాజాగా మరో కన్వెన్షన్ కట్టడాలను ఈ హైడ్రా నేలమట్టం చేసింది. 

HYDRA : హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువులు, నీటి ప్రవాహాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఇలా ఇప్పటికే అనేక నిర్మాణాలను కూల్చేసిన ఈ సంస్థ ఇప్పుడు గచ్చిబౌలిలో కూల్చివేతలు చేపట్టింది.  ఫర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లోని అక్రమ కట్టడాలను కూల్చివేయిస్తున్నారు హైడ్రా అధికారులు. 

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించిన నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మినీ హాల్, ఫుడ్ కోర్టును అనుమతిలేకుండా నిర్మించారంటే వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా విచారణ జరిపింది. నిజంగానే ఈ నిర్మాణాలు అక్రమమని తేలడంతో బుల్డోజర్ తో రంగంలోకి దిగారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు చేపట్టారు.

పర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా  ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటి లేఔట్ లోని రోడ్లు, పార్కుల స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలే కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో నిబంధనలకు లోబడి నిర్మించే నిర్మాణాల జోలికి తాము వెళ్లడం లేదని తెలిపారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ భూములు చాలా ముఖ్యమని.. తాము కేవలం వాటిని కాపాడేందుకే పనిచేస్తున్నామని హైడ్రా స్పష్టం చేస్తోంది.