- Home
- Life
- Food
- Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Leftover Rice: అన్నం మిగిలిందని పులిహోర చేస్తున్నారా? పిల్లలు మెచ్చే ఈ క్రేజీ స్నాక్ ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Leftover Rice: మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది పులిహార చేస్తారు లేదంటే.. పాడేస్తారు. కానీ, ఆ అన్నంతోనే ఇంటిల్లిపాదికీ నచ్చేలా క్రేజీ స్నాక్స్ చేయచ్చు. అది కూడా పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసేయచ్చు.

మిగిలిపోయిన అన్నం..
రాత్రి వండిన అన్నం.. ఉదయానికి మిగిలిపోవడం సాధారణంగా అందరి ఇళ్లల్లో జరిగేదే. తింటాం కదా అని వండుతాం. కానీ, ఇంట్లో ఒక్కరు సరిగా తినకపోయినా అది మిగిలిపోయింది. మిగిలిపోయిన చద్దన్నం తినడం చాలా కష్టంగా ఉంటుంది. అలా అని ఎప్పుడూ చేసే బోరింగ్ పులిహోర తినాలన్నా కష్టంగానే ఉంటుంది. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఆ అన్నంతో ఎలాంటి స్నాక్స్ చేయచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎక్కువ కష్టపడకుండా, కేవలం పది నిమిషాల్లో కరకరలాడే రైస్ పొటాటో చీజ్ బాల్స్ తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. మిగిలిపోయిన అన్నం, ఉడికించిన రెండు బంగాళదుంపలు ముఖ్యంగా ఉంటే సరిపోతుంది.
ఎలా తయారు చేయాలంటే...
వీటిని ఎలా తయారు చేయాలంటే... మిగిలిపోయిన అన్నాన్ని ఒక కప్పు తీసుకోవాలి. దానిలో ఉడికించిన రెండు బంగాళదుంపల తురుము వేయాలి. ఈ రెండిటినీ చేతులో చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు కూడా వేయాలి. ఆ రుచిని మరింత పెంచుకోవడానికి తరిగిన ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు కూడా వేయాలి. వీటిని వేయడం వల్ల పోషకాలు కూడా అందుతాయి. కారం కోసం చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసుకోవచ్చు. చివరగా పావు స్పూన్ దనియాల పొడి, మొక్క జొన్న పిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు.. సిద్ధం చేసుకున్న మిశ్రమం నుండి ఒక చిన్న ఉండను తీసుకుని, మీ అరచేతిలో పరచి, మధ్యలో మొజారెల్లా చీజ్ను ఉంచండి. దానిని అన్ని వైపులా మూసివేసి, ఉండ లేదా టిక్కీలా చేయండి. వేయించేటప్పుడు చీజ్ లోపల సురక్షితంగా కరిగేలా, అది బయటకు రాకుండా టిక్కీని పూర్తిగా మూసివేయాలి.
నూనెలో వేయించే విధానం..
ఇప్పుడు మరో గిన్నెలో మైదా పిండి, మొక్క జొన్న పిండి వేసి కలపాలి. దీనిలో కొద్దిగా ఉప్పు, కారం కూడా వేయాలి. వీటిని కలిపిన తర్వాత నీటిని పోసి.. పల్చటి మిశ్రమంలా కలపాలి. తర్వాత.. ముందుగా తయారు చేసుకున్న టిక్కీలను ఈ మైదా పిండి మిశ్రమంలో ముంచి.. తర్వాత బ్రెడ్ క్రంబ్ర్ తో పూత వేయాలి. అలా అన్నింటినీ సిద్ధం చేసుకొని వాటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు.. ఒక పాన్లో నూనె పోసి, మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టిక్కీలను ఒక్కొక్కటిగా ఈ నూననెలో వేయించుకుంటే సరిపోతుంది. కమ్మనైనా రైస్ పొటటో చీజ్ బాల్స్ రెడీ అయినట్లే. ఇవి బయటకు క్రంచీగా.. లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటాయి.

