First Rakhi: మొదటిసారి రాఖీని ఎవరు ఎవరికి కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
First Rakhi: ప్రతి ఏడాది వచ్చే రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ ప్రేమను, రక్షణను చాటేందుకు రాఖీని కడతారు. చరిత్రలో రాఖీని తొలిసారి ఎవరు ఎవరికి కట్టారో తెలుసా?

మొట్టమొదటి రాఖీ ఎవరు కట్టారు?
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలలో తోబుట్టువుల ప్రేమానురాగాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రేమకు ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన పండుగ రక్షాబంధన్. ఇది కేవలం చేతికి కట్టే ఒక సాధారణ దారం మాత్రమే కాదు.. నమ్మకం, బాధ్యత, ఒక బలమైన బంధం. రాఖీ కట్టే ఈ సంప్రదాయం వెనుక వేల ఏళ్ల నాటి పౌరాణిక సందర్భాలు ఉన్నాయి. వేద కాలంలో మొట్టమొదటి రక్షాసూత్రాన్ని దేవేంద్రుడి భార్య శచీదేవి తన భర్త రక్షణ కోసం కట్టిందని పురాణాలు చెబుతాయి. రాక్షసులతో జరిగిన భీకర యుద్ధంలో దేవతలు ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, శచీదేవి తన తపోశక్తితో రూపొందించిన పవిత్ర రక్షాసూత్రాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టడంతో ఆయన విజయం సాధించాడని ప్రతీతి. కాలక్రమేణా ఈ రక్షాబంధనం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆప్యాయతానుబంధాలను చాటే దివ్యమైన వేడుకగా రూపాంతరం చెందింది.
మహాభారతంలోని కథ
మహాభారతంలో శ్రీకృష్ణుడి చేతి వేలికి గాయమై రక్తం కారుతున్న సమయంలో ద్రౌపది ఏమాత్రం తడబడకుండా తన పట్టుచీర అంచును చించి కృష్ణుడి వేలికి కట్టింది. ఆమె నిస్వార్థమైన ప్రేమాభిమానాలకు కరిగిపోయిన శ్రీకృష్ణుడు, ఆపద సమయంలో ఆమెను కాపాడతానని మాట ఇచ్చి, కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం వేళ చీరను అందించి ఆమె ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు. అలాగే లక్ష్మీదేవి తన భర్త విష్ణుమూర్తిని వైకుంఠానికి తిరిగి తీసుకురావడానికి బలి చక్రవర్తికి రక్షాసూత్రం కట్టి, ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను విడిపించుకున్న కథ కూడా చెప్పుకుంటారు. అటు యమునా నది తన సోదరుడైన యమధర్మరాజుకు రాఖీ కట్టి ఆదరించగా, ఈ పర్వదినాన సోదరి చేత రాఖీ కట్టించుకునే సోదరుడికి దీర్ఘాయువు లభిస్తుందని యముడు వరం ప్రసాదించాడు. గణేశుడి కుమారులైన శుభ్, లాభ్ కోరిక మేరకు సాక్షాత్తు సంతోషీ మాత ఆవిర్భవించి వారికి రాఖీ కట్టిన సందర్భం కూడా ఈ పండుగ విశిష్టతను చాటుతుంది.
పురుషోత్తముడికి రాఖీ
క్రీస్తుపూర్వం 326లో గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రోక్సానా తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతూ భారతీయ పాలకుడు పురుషోత్తముడికి (పోరస్) రాఖీ పంపింది. యుద్ధరంగంలో అలెగ్జాండర్ను సంహరించే అవకాశం దక్కినప్పటికీ, చేతికి ఉన్న రాఖీని గౌరవించి పురుషోత్తముడు వెనక్కి తగ్గాడు. అలాగే 16వ శతాబ్దంలో మేవాడ్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపగా, మతాలకు అతీతంగా ఆ పవిత్ర బంధాన్ని గౌరవించిన హుమాయూన్ ఆమెకు రక్షణగా సైన్యంతో కదిలాడు. ఈ విధంగా యుగాలు మారినా, తరాలు మారినా రక్షాబంధనం అనేది మానవ సంబంధాలను, పరస్పర గౌరవాన్ని, స్త్రీల రక్షణను నిరంతరం గుర్తు చేస్తుంది.

