Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?
Interesting Facts: నదులపై వంతెనలు నిర్మించడం ప్రస్తుతం సాధారణం అయిపోయింది. కానీ వేగంగా ప్రవహించే నదులపై అంత బలమైన వంతెన ఎలా కడతారు? అసలు అక్కడ ఎలా పనిచేస్తారు? అవి ఎన్నో ఏళ్లు చెక్కుచెదరకుండా ఎలా ఉంటాయి? వంటి విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

నదులపై వంతెన ఎలా కడతారు?
మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో ఒకటే నదిపై వంతెన నిర్మాణం. మనం ఏళ్ల తరబడి బ్రిడ్జిలపై ప్రయాణిస్తున్నాం. కానీ, ఉధృతంగా ప్రవహించే నది మధ్యలో ఇంత పెద్ద పిల్లర్లను ఎలా నిర్మిస్తారు? అవి భారీ వాహనాల బరువును ఎలా మోస్తాయి? ఎన్నో ఏళ్లపాటు స్ట్రాంగ్ గా ఎలా ఉంటాయి? దీని వెనుక ఉన్న సవాళ్లు, వంతెన నిర్మాణ పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వంతెన డిజైన్
వేగంగా ప్రవహించే నది మధ్యలో పిల్లర్లు నిర్మించడం అత్యంత సవాలుతో కూడుకున్న పని. దీనికి కచ్చితత్వం, ధైర్యం, ఆధునిక టెక్నాలజీ అవసరం. చిన్న పొరపాటు జరిగినా, నెలల తరబడి చేసిన కష్టం వృథా అవుతుంది. వంతెన కట్టే ముందు, ఇంజినీర్లు ఆ నదిని పూర్తిగా సర్వే చేస్తారు. నీటి లోతు, నది గర్భంలోని నేల బలం, నీటి ప్రవాహ వేగాన్ని కొలుస్తారు. వీటి ఆధారంగా, ఎన్ని పిల్లర్లు అవసరమో నిర్ణయించి, వంతెన డిజైన్ను రూపొందిస్తారు.
కాఫర్ డ్యామ్
నదిపై వంతెన పునాదులు వేయడానికి కాఫర్ డ్యామ్ చాలా ముఖ్యం. ఇది నిర్మాణ పనుల కోసం పొడి ప్రదేశాన్ని సృష్టించేందుకు ఉపయోగపడే ఒక తాత్కాలిక వాటర్ప్రూఫ్ నిర్మాణం. 10-20 మీటర్ల పొడవైన స్టీల్ షీట్లను ఉపయోగించి ఈ కాఫర్ డ్యామ్లను నిర్మిస్తారు. హైడ్రాలిక్ సుత్తులు లేదా వైబ్రేటర్ల ద్వారా ఈ షీట్లను నది అడుగు భాగంలో ఉంచుతారు. ఈ షీట్లను ఒకదానికొకటి కలిపి గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఒక గోడలా నిర్మిస్తారు. ఇది నిర్మాణ ప్రాంతంలోకి నీరు రాకుండా అడ్డుకుంటుంది.
చిన్న లీక్ కూడా ప్రమాదమే..
కాఫర్డ్యామ్ కట్టాక, లోపలున్న నీటిని పెద్ద పంపులతో బయటకు తోడి, తిరిగి నదిలోకి వదిలేస్తారు. ఇప్పుడు ఆ ప్రదేశం పొడిగా మారుతుంది. కార్మికులు నిచ్చెనలు లేదా క్రేన్ల సాయంతో ఆ పొడి ప్రదేశంలోకి దిగి ఇసుక, మట్టి, రాళ్లను తొలగిస్తారు. నేలపై పునాది వేయడానికి, వంతెన బరువును మోసేందుకు 20-25 మీటర్ల పొడవైన ఇనుప పైపులను నది గర్భంలోకి పంపుతారు. ఆ తర్వాత, పునాది కోసం కాంక్రీట్ వేస్తారు. గాలి బుడగలను తొలగించి, నిర్మాణం బలంగా, ఎక్కువ కాలం ఉండేలా వైబ్రేటర్లను వాడతారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా కష్టంతో కూడుకుంటుంది. కాఫర్ డ్యామ్లో చిన్న లీక్ వచ్చినా లేదా భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
కైసన్ టెక్నాలజీ
ఈ పనులు పూర్తయ్యాక, ఇంజినీర్లు కైసన్ టెక్నాలజీని వాడతారు. ఇవి నీరు చొరబడని పెట్టెలు. వీటిని నది అడుగుభాగంలో ఉంచుతారు. లోపల కార్మికులు పనిచేయడానికి పొడి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఓపెన్ కైసన్ల అడుగున ఒక రంధ్రం ఉంటుంది, అది మునగడానికి సహాయపడుతుంది. న్యూమాటిక్ కెైసన్లు, ఒత్తిడితో కూడిన గాలిని ఉపయోగించి నీటిని బయటకు నెడతాయి. కార్మికులు ఎయిర్లాక్ ద్వారా ఈ ప్రెషరైజ్డ్ గదిలోకి ప్రవేశించి సేఫ్ గా పని చేస్తారు. ఇలా సాంకేతికత సాయంతో, కార్మీకుల కష్టంతో వంతెన నిర్మాణాలను అనుకున్న టైంలో పూర్తి చేస్తారు.

