- Home
- Feature
- Haunted Mumbai: ముంబై వెళితే ఈ ప్రదేశాలకు రాత్రిపూట ఒంటరిగా వెళ్లకండి.. భయంతో గుండె ఆగిపోతుంది
Haunted Mumbai: ముంబై వెళితే ఈ ప్రదేశాలకు రాత్రిపూట ఒంటరిగా వెళ్లకండి.. భయంతో గుండె ఆగిపోతుంది
Haunted Mumbai: మనదేశ ఆర్ధిక రాజధాని ముంబయి. ముంబయి అనగానే అందరికీ బాలీవుడ్, నైట్ లైఫ్, సీ లింక్, తాజ్ హోటల్ గుర్తొస్తాయి. వీటితో పాటూ కొన్ని భయానక ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి పేర్లు వింటేనే అక్కడి స్థానికులు భయపడిపోతారు.

ముకేశ్ మిల్స్
ముంబయిలోని కొలాబా బీచ్ దగ్గర ఉంటుంది ఈ ముకేశ్ మిల్స్. ముంబైలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా దీని గురించి చెబుతారు. ఇక్కడ చాలా బాలీవుడ్ సినిమాల షూటింగ్లు జరిగినా, రాత్రిపూట మాత్రం ఎవరూ ఉండరు. అక్కడ రాత్రిపూట వింత సంఘటనలు జరుగుతాయని చెప్పుకుంటారు. షూటింగ్ సమయంలో ఏదో తెలియని శక్తి తమకు అనుభవమైందని కొందరు నటీనటులు కూడా చెప్పారు.

డి'సౌజా చాల్
ముంబైలోని మాహిమ్ ప్రాంతంలో ఉన్న డి'సౌజా చాల్ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రాత్రిపూట ఈ ప్రాంతంలో చనిపోయిన ఒక మహిళ ఆత్మ తిరుగుతుందని స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో ఆమె అడుగుల చప్పుడు వినిపిస్తుందని అంటారు. అలాగే ఆమె గుసగుసలు వినిపిస్తాయనే వాదనలు కూడా ఉన్నాయి.
సంజయ్ గాంధీ నేషనల్ పార్క్
ముంబైలో ఉన్న సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ పగటిపూట పర్యాటకులతో కిటకిటలాడిపోతుంది. కానీ రాత్రి అయితే మాత్రం పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అడవి లోపల నుంచి వింత శబ్దాలు, నీడలు కనిపిస్తాయని కొందరు చెబుతుంటారు. అక్కడి సిబ్బంది కూడా రాత్రిపూట లోపలికి వెళ్లేందుకు భయపడతారు.
టవర్ ఆఫ్ సైలెన్స్
పార్శీ కమ్యూనిటీ వాళ్లు అంత్యక్రియల కోసం ఉపయోగించే ప్రదేశం.. ఈ టవర్ ఆఫ్ సైలెన్స్. దీని చుట్టూ అనేక దెయ్యాల కథలు వినిపిస్తాయి. రాత్రిపూట అక్కడ తమకు వింత అనుభవాలు ఎదురయ్యాయని కొందరు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతంలో రాత్రయితే ఎవరూ తిరిగేందుకు ఇష్టపడరు.
తాజ్ ప్యాలెస్ హోటల్
ముంబై అంటే గుర్తొచ్చేది తాజ్ ప్యాలెస్ హోటల్. దీని చుట్టూ కూడా దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హోటల్ను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్, భవనం తన ప్లాన్ ప్రకారం నిర్మించలేదనే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. అతను ఇంకా ఆ హోటల్ లోనే ఆత్మగా తిరుగుతున్నాడని ఎంతో మంది నమ్మకం. కొంతమందికి హోటల్లో వింత అనుభవాలు ఎదురయ్యాయని కూడా చెబుతారు.

