Facts: నదిలో నీరు తియ్యగా, సముద్రంలో నీరు ఉప్పుగా ఎందుకుంటాయో తెలుసా.?
Facts: సముద్రంలో పుష్కలమైన నీరు ఉంటుంది. అయితే అంత నీరున్నా అది తాగడానికి పనికిరాదు? నదిలో నీరు తియ్యగా ఉంటే, సముద్రంలో మాత్రం ఎందుకు ఉప్పుగా ఉంటుంది? అయితే దీనివెనకాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఉప్పుదనం ఎలా వస్తుందంటే.?
వర్షపు నీరు పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను అది గ్రహిస్తుంది. అందువల్ల అది స్వల్ప ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. ఈ నీరు భూమిపై పడినప్పుడు రాళ్లను, నేలను మెల్లగా కరిగిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ‘రాక్ వెదరింగ్’ అంటారు. ఈ సమయంలో రాళ్లలో ఉన్న సోడియం, క్లోరైడ్ వంటి ఖనిజాలు విడిపోయి నీటిలో కలుస్తాయి. ఈ ఖనిజాలతో నిండిన నీరు చివరికి నదుల ద్వారా సముద్రాన్ని చేరుతుంది.
నదులు తెచ్చే లవణాలు
ప్రతి సంవత్సరం నదులు చిన్న మొత్తంలో లవణాలను సముద్రంలో కలుపుతాయి. ఒక సంవత్సరం చూస్తే అది చాలా తక్కువగా కనిపించవచ్చు. కానీ ఈ ప్రక్రియ బిలియన్ల సంవత్సరాలుగా జరుగుతోంది. కాలక్రమేణా ఈ లవణాలు సముద్రంలో పేరుకుపోయాయి. సముద్రం ఒక పెద్ద నిల్వ కేంద్రంలా పనిచేస్తుంది. అందుకే ఉప్పుదనం స్థిరంగా పెరుగుతూ వచ్చింది.
నదిలో నీరు తియ్యగా, సముద్రంలో ఉప్పుగా ఎందుకు
నదుల నీటిలో కూడా కొంత లవణం ఉంటుంది. కానీ నదులు నిరంతరం ప్రవహిస్తుంటాయి. అవి నీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవు. అందువల్ల లవణాలు అధిక సాంద్రతలో పేరుకుపోవు. సముద్రం మాత్రం తుది గమ్యం. అన్ని నదులు తెచ్చిన ఖనిజాలు అక్కడే చేరుతాయి. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారినప్పుడు నీరు మాత్రమే పైకి వెళ్తుంది. ఉప్పు మాత్రం అక్కడే మిగిలిపోతుంది. అందువల్ల కాలక్రమంలో సముద్రంలో ఉప్పు మోతాదు పెరిగింది. నదిలో ప్రవాహం ఉండటం వల్ల అది తియ్యగా కనిపిస్తుంది.
ఆవిరి ప్రక్రియ ఉప్పుదనాన్ని ఎలా పెంచుతుంది?
సూర్యుడి వేడి వల్ల సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారుతుంది. ఆ తరువాత వర్షంగా భూమిపై పడుతుంది. ఈ సర్కిల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆవిరి అయ్యేది నీరు మాత్రమే. లవణాలు, ఖనిజాలు సముద్రంలోనే మిగులుతాయి. ఈ ప్రక్రియ లక్షల ఏళ్లుగా పునరావృతమవుతుండటంతో, సముద్రంలో నీరు తగ్గి ఉప్పు నిల్వ పెరిగింది.
సముద్రపు నీటిలో ఉప్పు ఎంత ఉంటుంది?
సగటున సముద్రపు నీటిలో లవణీయత సుమారు 3.5% ఉంటుంది. అంటే ఒక కిలోగ్రాము సముద్రపు నీటిలో దాదాపు 35 గ్రాముల కరిగిన ఉప్పు ఉంటుంది. అందుకే సముద్రం నీరు తాగడానికి పనికిరాదు. అది ప్రకృతి శాస్త్రం, భౌగోళిక చక్రాలు కలిపి సృష్టించిన దీర్ఘకాలిక ఫలితం.

