నవ్వుల రారాజులు.. ఏడిపిస్తూ వెళ్లిపోయారు!
గత దశాబ్ద కాలంలో చాలామంది దిగ్గజ కమెడియన్లను కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ.
గత దశాబ్ద కాలంలో ఇండస్ట్రీ చాలా మంది కమెడియన్లను కోల్పోయింది. ఎవరికైనా ఏదొక దశలో మరణం తప్పదు కానీ వీళ్లలో దాదాపు అందరూ అర్ధాంతరంగా తనువు చాలించడం తెలుగు కామెడీ వెలవెలబోయేలా చేయడం విషాదకరమైన విషయం.
బ్రహ్మానందంకి ధీటుగా తెలుగులో తిరుగులేని కమెడియన్ గా పేరు తెచ్చుకొని ఎన్నో అధ్బుతమైన పాత్రల్లో నటించి నవ్వులు పంచిన ఎమ్మెస్ నారాయణ కమెడియన్ గా మంచి ఫాంలో ఉండగానే మరణించారు. చనిపోయే సమయానికి ఆయనకీ 64 ఏళ్లు.
మొదట విలన్ పాత్రలతో మెప్పించి.. ఆ తర్వాత కామెడీ వైపు టర్నింగ్ ఇచ్చుకున్న ఆహుతి ప్రసాద్ సైతం ఎమ్మెస్ చనిపోయిన అదే ఏడాది 2013లో మరణించారు. గుండెపోటుతో 57 ఏళ్ల వయసులో ఆహుతి ప్రసాద్ మరణించారు.
కమెడియన్ ఏవీఎఎస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా నవ్వించారో తెలిసిందే. అప్పట్లో ఆయన లేని సినిమాలు ఉండేవి కావు. కొన్ని సినిమాల్లో ఎమోషనల్ పాత్రలు కూడా పోషించారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.
మరో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం తక్కువ వయసులోనే మరణించారు. 2013లో చనిపోయే సమయానికి ఆయన వయసు 53 ఏళ్లు మాత్రమే. ఎక్కువగా లెక్చరర్ పాత్రలు పోషించి ఆడియన్స్ ని నవ్వించారు.
లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణా శకుంతల చనిపోయిందంటే నమ్మశక్యం కాదు. ఆమె సినిమాల ద్వారా ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంది.
చిన్న పాత్రలతోనే తనదైన శైలిలో నవ్వించిన గుండు హనుమంతరావు ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. 'అమృతం' సీరియల్ తో బాగా ఫేమస్ అయిన ఆయన సినిమాల్లో కూడా నటించాడు.
లేటు వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలతో కడుపుబ్బ నవ్వించిన కొండవలస లక్ష్మణరావు సైతం గత కొన్నేళ్లలోనే తనువు చాలించారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీపతి 2008లో కన్నుమూశారు.
రీసెంట్ గా కమెడియన్ వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. ఆయన మరణం ఎందరినో బాధించింది.
తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన ఇద్దరు మేటి దర్శకులు సైతం తక్కువ వయసులోనే వెళ్లిపోయారు. అందులో ఒకరు హాస్య బ్రహ్మ . జంధ్యాల. 2001లో జంధ్యాల చనిపోయే సమయానికి ఆయన వయసు 51 ఏళ్లు మాత్రమే.
కామెడీ సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సైతం తక్కువ వయసులోనే వెళ్లిపోయారు.